Revanth Reddy Govt | కాంగ్రెస్ ప్రభుత్వ ఆయుష్షు సగం అయిపోయింది: జీవన్ రెడ్డి

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Govt | రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ సాక్షిగా ప్రకటించిన ‘రైతు డిక్లరేషన్’ హామీలు అమలుకు నోచుకోకుండా కేవలం నీటి మూటలుగానే మిగిలిపోయాయని ఆయన మండిపడ్డారు. రైతులకు బోనస్ ఇస్తామని ఆశ చూపి, కనీసం మద్దతు ధర కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వంచిస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. జిల్లాలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా ఉన్నా, ఇప్పటికీ నామమాత్రంగానే కొనుగోళ్లు సాగుతున్నాయని విమర్శించారు. క్వింటాకు మూడు కిలోల తరుగు తీస్తూ, ఎకరానికి సుమారు రూ. 3 వేల వరకు రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ గ్రేడ్ ధాన్యాన్ని కావాలనే బీ గ్రేడ్‌గా చూపిస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఆన్‌లైన్ ప్రక్రియను అధికారులే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Revanth Reddy Govt | ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం..

ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఫోర్త్ సిటీ’ కాన్సెప్ట్‌పై జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూడటం సరికాదని అన్నారు. ఎల్ అండ్ టీ (L&T) వంటి దిగ్గజ సంస్థలే లాభాలు రావని తప్పుకుంటుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ఎందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన ప్రశ్నించారు.

Revanth Reddy Govt | కాళేశ్వరం, తుమ్మిడిహట్టిపై సవాల్..

కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు దెబ్బతింటే, కాంట్రాక్టర్ మరమ్మతు చేస్తానని ముందుకొచ్చినా ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి, ప్రధాని మోదీకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోందని.. అదే నిజమైతే మోదీతో మాట్లాడి తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురావాలని సవాల్ విసిరారు. అలా చేస్తే ప్రభుత్వానికి పాలాభిషేకం చేస్తామన్నారు.

Revanth Reddy Govt | ప్రభుత్వానికి ఆయుష్షు సగం అయిపోయింది..

రేవంత్ రెడ్డి పాలనపై సెటైర్లు వేస్తూ.. మూడేళ్లు గడుస్తున్నా ముఖ్యమంత్రికి ఇంకా పాలనపై అవగాహన రావడం లేదని ఎద్దేవా చేశారు. “ఈ ప్రభుత్వం ఆయుష్షు ఇప్పటికే సగం అయిపోయింది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కోతుల సమస్య వల్ల రైతులు మామిడి చెట్లను నరికివేస్తున్నారని, పంట మార్పిడి పేరుతో వారిని మభ్యపెట్టవద్దని ఆయన హితవు పలికారు.

ఇది కూడా చదవండి: Saudi Job Scam|సౌదీ ఎడారిలో జగిత్యాల యువకుడి నరకయాతన.. ‘నన్ను కాపాడండి’ అంటూ సెల్ఫీ వీడియో వైరల్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *