అక్షరటుడే, వెబ్డెస్క్: Gangadhara Sub Registrar | పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో పనిచేసిన సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో, ప్రస్తుత గంగాధర ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ మండ కిరణ్ కుమార్ను మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్టు చేశారు.
Gangadhara Sub Registrar | యూపీఐ చెల్లింపుల రూపంలో
మండ కిరణ్ కుమార్ గతంలో పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా, ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో అంటే.. అక్టోబరు 27, 2025 నుంచి నవంబర్ 12, 2025 మధ్య కాలంలో తన ప్రైవేట్ అసిస్టెంట్ బిట్టు (రత్న కుమార్) ద్వారా డాక్యుమెంట్ రైటర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. దాదాపు రూ. 1,06,500 మొత్తాన్ని యూపీఐ (UPI) చెల్లింపుల రూపంలో లంచంగా స్వీకరించినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు.
Gangadhara Sub Registrar | నిజామాబాద్లో అరెస్టు
గతేడాది నవంబర్ 14న పెద్దపల్లి కార్యాలయంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కిరణ్కుమార్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, ఆయన ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధరలో విధులు నిర్వహిస్తున్నారు.
సుదీర్ఘ విచారణ అనంతరం, కిరణ్ కుమార్ను మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు నిజామాబాద్లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. ఆయన్ను కరీంనగర్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1064కు, వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు కోరారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వారు స్పష్టం చేశారు.

