అక్షరటుడే వెబ్డెస్క్ :Telangana Irrigation Projects |తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో పొరుగు రాష్ట్రం అనుసరిస్తున్న వ్యూహాలను ప్రస్తావిస్తూ, తెలంగాణ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో చొరవ చూపాలని కోరారు.
Telangana Irrigation Projects | నదీ జలాల వినియోగంపై ప్రశ్నలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదులపై ఒక విధానం విఫలమైతే మరో ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసుకుంటోందని, తెలంగాణలో అటువంటి ముందస్తు ప్రణాళికలు ఎందుకు లేవని ఆమె ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల రంగానికి రూ. 1.80 లక్షల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేసిన కవిత, ప్రస్తుత ప్రభుత్వం కూడా వేల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నప్పటికీ, ఇప్పటికీ నదీ జలాల్లో మన పూర్తి వాటాను వినియోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana Irrigation Projects | నాణ్యమైన నిర్మాణాలు..
తాము అధికారంలోకి వస్తే వందేళ్ల పాటు మన్నికగా ఉండేలా గేట్లతో కూడిన శాశ్వత చెక్ డ్యామ్లను నిర్మిస్తామని, గతంలో మాదిరిగా కొట్టుకుపోయే నిర్మాణాలకు తావుండదని స్పష్టం చేశారు. జూరాల ప్రాజెక్ట్ నుంచి ఏపీ సరిహద్దు వరకు నీటి నిల్వకు సరైన ఆనకట్టలు లేవని కవిత పేర్కొన్నారు. భవిష్యత్తులో వాటర్ కమిషన్ ఏర్పాటు చేసి కృష్ణా, గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని హామీ ఇచ్చారు. నీళ్ల కోసమే తెలంగాణ ఏర్పడిందని, బనకచర్ల విషయంలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ను కలుస్తామని ఆమె తెలిపారు.
Telangana Irrigation Projects | బీసీ రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్త పర్యటన..
రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా దేశమంతటా పర్యటిస్తామని కవిత ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి పంపిన బీసీ బిల్లులను కేంద్రం తక్షణమే ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Vijay Floor Test | బల పరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం

