అక్షరటుడే వెబ్డెస్క్:Digital Health Cards |తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం వేగం పెంచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, శుక్రవారం సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన ‘జాయింట్ స్టాఫ్ కౌన్సిల్’ సమావేశం జరిగింది. ఈ భేటీలో పీఆర్సీ, హెల్త్ కార్డులు, బదిలీల వంటి కీలక అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Digital Health Cards| పీఆర్సీ నివేదికపై ముమ్మర కసరత్తు
ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఆర్సీ (PRC) నివేదికను వీలైనంత త్వరగా తెప్పించుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని సీఎస్ వెల్లడించారు. ఈ దిశగా కమిషన్ కూడా వేగంగా పనిచేస్తోందని, నివేదిక అందిన వెంటనే తదుపరి చర్యలు చేపడతామని ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు.
Digital Health Cards | జూన్ 2 నుంచి డిజిటల్ హెల్త్ కార్డులు..
రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా ఉద్యోగులకు డిజిటల్ హెల్త్ కార్డులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి లాంఛనంగా పనులు ప్రారంభించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. అలాగే, ఆర్థికేతర సమస్యలు, సర్వీస్ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు.
Digital Health Cards | 317 జీవో , బదిలీలపై చర్చ..
ఉద్యోగుల బదిలీలు, ముఖ్యంగా వివాదాస్పదంగా మారిన 317 జీవో (GO 317) బదిలీలు, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. జిల్లా , డైరెక్టరేట్ స్థాయిల్లో కూడా ఇలాంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను ఏర్పాటు చేసి, స్థానిక సమస్యలను అక్కడే పరిష్కరించాలని సీఎస్ సూచించారు.
Digital Health Cards | అధునాతన సాంకేతికతతో మెరుగైన సేవలు..
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఉద్యోగులు చురుగ్గా వ్యవహరించాలని సీఎస్ కోరారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ మహేశ్ దత్ ఎక్కా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, టీఎన్జీవో (TNGO) అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీజీవో అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు తదితర ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Indiramma Houses | వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన


