అక్షరటుడే, వెబ్డెస్క్ : Hormuz Strait attacks | పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులపై భారత్ ఐక్యరాజ్యసమితి (UNO)లో ఆందోళన వ్యక్తం చేసింది. పౌర నౌకలు, సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పార్వతనేని హరీష్ పేర్కొన్నారు.
హర్మూజ్ జలసంధి దగ్గర భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీసే కుట్రలను అడ్డుకోవాలని కోరింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను కాపాడాలని స్పష్టం చేసింది. ఒమన్ తీరంలో భారత జెండా ఉన్న నౌకపై దాడి జరిగిన కొద్ది రోజులకే ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి (UNECOSOC) ప్రత్యేక సమావేశంలో హరీష్ మాట్లాడుతూ, వాణిజ్య నౌకలపై దాడులు ప్రపంచ ఇంధన, సరఫరా గొలుసులకు ముప్పు కలిగిస్తాయని హెచ్చరించారు.
Hormuz Strait attacks | భారత నౌకపై దాడి
ఒమన్ (Oman) సమీపంలో సోమాలియా నుంచి వస్తున్న భారత జెండా కలిగిన వాణిజ్య నౌకపై ఈ నెల 13న దాడి జరిగిన విషయం తెలిసిందే. ఒమన్ అధికారులు ఆ నౌకలోని 14 మంది సిబ్బందిని రక్షించారు. ఈ దాడిని ఎవరు చేశారనేది తెలియరాలేదు. విదేశాంగ మంత్రిత్వ శాఖ సైతం ఈ దాడిని ఖండించింది. ఈ క్రమంలో తాజాగా భారత్ ఐరాసతో దాడుల అంశాన్ని లేవనెత్తింది. ఇరాన్–అమెరికా యుద్ధం ప్రారంభం అయిన తర్వాత రెండు భారత జెండా ఉన్న నౌకలు దాడులకు గురయ్యాయి.
దీనిని కూడా చదవండి : America Iran Tensions | మళ్లీ యుద్ధం తప్పదా.. డోనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్


