అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Road Funds | ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) కింద తెలంగాణకు మరిన్ని రహదారి పనులు మంజూరు చేయాలని, ముఖ్యంగా ఆదివాసి గిరిజన మారుమూల ప్రాంతాల్లో రహదారి అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ల దక్షిణాది రాష్ట్రాల PMGSY ప్రాంతీయ సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొని రాష్ట్ర సమస్యలు, అవసరాలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత 25 ఏళ్లుగా PMGSY గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, మార్కెట్లకు రాకపోకలను మెరుగుపరిచిందన్నారు. ప్రస్తుతం ఈ పథకం మారుమూల గ్రామాలు, ఆదివాసి గిరిజన గూడెలను, మైదాన ప్రాంతాలతో అనుసంధానం చేస్తుందన్నారు. గతంలో ప్రధానమంత్రి గ్రామీణ యోజన పథకానికి 100 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించేదని, కానీ ప్రస్తుతం నిబంధనలు మార్చి రాష్ట్రాలపై 40 శాతం భారం వేస్తోందన్నారు. ఆ విధానాన్ని పునఃసమీక్షించాలని కోరారు.
Telangana Road Funds | అనుమతులు ఆలస్యం
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ ఆసిఫాబాద్ వంటి ఆదివాసి, గిరిజన ప్రాంతాల్లో అటవీ, వన్యప్రాణి చట్టాల కారణంగా రోడ్డు పనులకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. గిరిజనాభివృద్ధి, గ్రామీణ రవాణా సౌకర్యాల దృష్ట్యా అటవీ, వన్యప్రాణి నిబంధనల్లో అనుకూల మార్పులు చేయాలని కోరారు. ఇప్పటికే ఉన్న పాత రహదారులు, కల్వర్టులు దెబ్బతిన్న ప్రాంతాల్లో పునర్నిర్మాణం, అప్గ్రేడేషన్ పనులకు కూడా అటవీ నిబంధనలు అడ్డంకిగా మారాయని, ఆయా పనులకు సులభంగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Future City Cancellation | ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు


