అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Paddy Procurement | ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు జూన్ 5లోగా పూర్తి చేయాలని (Paddy Procurement) కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (KVR MLA) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లయ్, వ్యవసాయ శాఖ (Department of Agriculture), తదితర అధికారులతో సమీక్షించారు.
Kamareddy Paddy Procurement | తడిసిన ధాన్యాన్ని కొనాలి
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభం అయ్యేలోగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు, రవాణా, తరలింపు ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద హమాలీలను ఏర్పాటు చేసి అన్లోడింగ్లో ఎలాంటి ఆలస్యం లేకుండా చూడాలన్నారు. వరిధాన్యం నిల్వలు, కుప్పలను టార్పాలిన్లతో కప్పి రక్షించాలని, వాటిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా, తిరస్కరించకుండా అన్లోడ్ చేయాలన్నారు. ప్రతి రైస్ మిల్లు రోజుకు కనీసం 12 వాహనాలను తప్పనిసరిగా అన్లోడ్ చేయాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం కామారెడ్డి నియోజకవర్గంలో 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, 65 వేల మెట్రిక్ టన్నులు తరలించినట్లు తెలిపారు. మరో 25 వేల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలుకు అవకాశం ఉందన్నారు. 1,471 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయగా, 1,231 మెట్రిక్ టన్నులు తరలించినట్లు పేర్కొన్నారు.


