అక్షరటుడే, వెబ్డెస్క్ : Approach Roads | అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం మోక్షం కలిగించింది. పెండింగ్లో ఉన్న వీటి నిర్మాణానికి రూ.148 కోట్లు మంజూరు చేసింది.
రాష్ట్రంలో మూడేళ్ల నుంచి అనేక వంతెనలు నిర్మించారు. అయితే ఆ వంతెనల నుంచి రోడ్డును కలుపుతూ అప్రోచ్ రోడ్లు వేయలేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని వంతెనల వద్ద కంకర పోసి వదిలేశారు. మరికొన్ని చోట్ల మట్టి పోసి సరిపెట్టారు. దీంతో వాహనాలు అదుపు తప్పి పడిపోతున్నాయి. దుమ్ము లేస్తోంది. ఈ క్రమంలో అప్రోచ్ రోడ్లు నిర్మించాలని ప్రజలు చాలా రోజులుగా కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నిధులు మంజురు చేశారు.
Approach Roads | తక్షణమే చేపట్టాలి
ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన మౌలిక సదుపాయాలు, మూలధన పనుల కేబినెట్ ఉప కమిటీ (Cabinet Sub-committee) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రూ.148 కోట్లు విడుదల చేయడానికి ఉప కమిటీ ఆమోదం తెలిపిందని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు.
Approach Roads | వర్షాకాలానికి ముందే..
అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలను సరైన నమూనాలో (format) పంపించాలని భట్టి ఆదేశించారు. అలా అయితే అనుమతులు, పనుల అమలు వేగవంతమవుతుందని పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, జూన్ 8వ తేదీలోగా అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని వారంవారీగా సమీక్షిస్తామని, టెండర్ల ప్రక్రియ, పనుల అమలు, నాణ్యతా ప్రమాణాలను నిశితంగా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : CI & SI Caught by ACB | స్టేషన్ బెయిల్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్సై

