అక్షరటుడే, వెబ్డెస్క్: Atya Patya Selection | నిజామాబాద్ జిల్లా అత్యా–పత్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్ జూనియర్ బాల, బాలికల ఎంపికలు కలెక్టర్ గ్రౌండ్లో విజయవంతంగా ముగిశాయి. ఈ విషయాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంజీవ్ తెలిపారు.
Atya Patya Selection | 10వ తేదీ నుంచి హైదరాబాద్లో
ఎంపికల పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీల కోసం ఎంపిక చేసినట్లు వారు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ నుంచి హైదరాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి అత్యా–పత్యా పోటీల్లో జిల్లా తరఫున ఈ క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయిలోనూ వారు ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అత్యా–పత్యా భారతదేశంలోని అత్యంత పురాతన క్రీడల్లో ఒకటని, పలు రాష్ట్రాల్లో ఈ క్రీడకు విశేష ఆదరణ ఉందని పేర్కొన్నారు. ఈ క్రీడ ద్వారా ఎంతోమంది క్రీడాకారులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు పొందిన విషయాన్ని గుర్తుచేశారు.
Atya Patya Selection | మంచి ఉద్యోగ అవకాశాలు
పాఠశాల స్థాయి నుంచే క్రీడాకారులు ప్రతిభ కనబరిచి, క్రమశిక్షణతో శిక్షణ పొందితే క్రీడారంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని ఆయన సూచించారు.
ముగింపు కార్యక్రమానికి జిల్లా యువజన – క్రీడాశాఖ అధికారి పవన్ కుమార్ హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. అత్యా–పత్యా క్రీడ ప్రాముఖ్యాన్ని వివరించిన ఆయన.. ఈ క్రీడ ద్వారా అనేక మంది జీవితాల్లో మంచి మార్పు వచ్చిందని, క్రీడాకారులు అంకితభావంతో సాధన చేసి ఉన్నత విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాము, మీసాల ప్రశాంత్, వ్యాయామ ఉపాధ్యాయులు గంగారెడ్డి, స్వప్న, శోభా, కల్పనతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు, క్రీడాకారులు పాల్గొన్నారు.