అక్షరటుడే, కామారెడ్డి : Bike Theft Gang | జిల్లాలో(Kamareddy) చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠాను సదాశివనగర్ పోలీసులు (Sadashivanagar Police) అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి నాలుగు బైక్లు స్వాధీనం చేసుకున్నారు.
Bike Theft Gang | ప్రత్యేక బృందాలతో దర్యాప్తు..
సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన హనుమంత్ రాజు గత నెల 24వ తేదీ రాత్రి తన బజాజ్ పల్సర్ బైక్ను ఇంటి ముందు పార్క్ చేశారు. మరుసటి రోజు ఉదయం బైక్ కనిపించకపోవడంతో ఆయన సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి రెండు ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలను పరిశీలించగా షేక్ ఇమ్రాన్, అద్నాన్ ఖాన్, సయ్యద్ జుబేర్, షేక్ అయాన్, సచిన్ విశ్వనాథ్ ఖండేవాల్ కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఇమ్రాన్, అద్నాన్ ఖాన్లు అద్నాన్కు చెందిన టీవీఎస్ రైడర్ బైక్పై హోటళ్లు, ఆస్పత్రులు, రైల్వేస్టేషన్ల వద్ద పార్క్ చేసిన బైక్లను గుర్తించేవారు. అనుకూలమైన వాహనాన్ని చూసి దొంగిలించి జుబేర్, అయాన్, సచిన్లకు తక్కువ ధరకు విక్రయించేవారు.
Bike Theft Gang | పోలీసులకు దొరక్కుండా..
అసలు నంబర్ ప్లేట్లను తొలగించి నకిలీ నంబర్లు అమర్చి పోలీసులకు దొరకకుండా ముఠా సభ్యులు తిరిగేవారు. ఆ తర్వాత వాటిని ఎక్కువ ధరకు అమ్మి లాభపడేవారు. సదాశివనగర్లో హనుమంత్ రాజు బైక్ను ఇమ్రాన్, అద్నాన్ రూ.7వేల సచిన్కు అమ్మినట్లు, సచిన్ నకిలీ నంబర్ ప్లేట్ వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. శనివారం పద్మాజీవాడి ఎక్స్ రోడ్ బ్రిడ్జి వద్ద పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు నిందితులను గుర్తించారు. జుబేర్, అయాన్, సచిన్ నకిలీ నంబర్లున్న పల్సర్ బైక్లపై వెళ్తుండగా, ఇమ్రాన్, అద్నాన్ మరో బైక్ను దొంగిలించి హైదరాబాద్లో అమ్మేందుకు వెళ్తున్నారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వెంబడించి అందరినీ అదుపులోకి తీసుకున్నారు.