అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Traffic Restrictions | హైదరాబాద్ నగరంలోని ఆదివారం లాల్ దర్వాజా బోనాలు ఘనంగా నిర్వహించనున్నారు. మిగతా ఆలయాల్లో సైతం బోనాలు జరగనున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నగరంలో ఆగస్టు 09, 10 తేదీలలో జరగనున్న బోనాల పండుగ ఉత్సవాలను పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. పాతబస్తీ సింహవాహిని మహంకాళి లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆగస్టు 9న ఉదయం 6 గంటల నుండి ఊరేగింపు ముగిసే వరకు, 10న ఉదయం 9 గంటల నుండి ఊరేగింపు ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఇంజిన్ బౌలి, ఫలక్నుమా వైపు నుండి ఆలియాబాద్ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. వీటిని కొత్త షంషేర్గంజ్ ‘T’ జంక్షన్ వద్ద గోశాల, తాడ్బన్ లేదా గోశాల మిస్రీగంజ్, ఖిల్వత్ వైపు మళ్లిస్తారు. మహబూబ్నగర్ (MBNR) ఎక్స్ రోడ్ నుంచి ఆలియాబాద్ వైపు వచ్చే వాహనాలను ఇంజిన్ బౌలి వద్ద జహానుమా, గోశాల, తాడ్బన్ లేదా ఖిల్వత్ వైపు మళ్లిస్తారు. బాలా గంజ్ నుండి లాల్ దర్వాజా ఆలయం వైపు వచ్చే వాహనాలను లక్ష్మీదేవి పాన్ షాప్ వద్ద నెహ్రూ స్టాచ్యూ నాగుల్ చింతా జంక్షన్ వైపు మళ్లిస్తారు.
Hyderabad Traffic Restrictions | పార్కింగ్ స్థలాలు
లాల్దర్వాజ బోనాలకు ఆలియాబాద్ వైపు నుండి వచ్చే భక్తులు శాలిబండ పోస్టాఫీసు ఎదురుగా ఉన్న దేవి ప్లైవుడ్ మెయిన్ రోడ్డుపై సింగిల్ లైన్లో, అల్కా థియేటర్ ఖాళీ స్థలంలో వాహనాలను పార్క్ చేయాలి. హరిబౌలి & గౌలీపురా వైపు నుండి వచ్చే భక్తులు ఆర్యవైశ్య మందిరం, అల్కా థియేటర్ ఖాళీ స్థలం, VDP స్కూల్ మైదానం లేదా మిత్రా స్పోర్ట్స్ క్లబ్లో పార్కింగ్ చేయాలి. మూసాబౌలి, మీర్చౌక్ వైపు నుండి వచ్చే వారు చార్మినార్ బస్ టెర్మినల్లో పార్క్ చేయాలి. ఆర్టీసీ బస్సులు చార్మినార్, ఫలక్నుమా, నయాపూల్ వైపు అనుమతించబడవు.
Hyderabad Traffic Restrictions | దర్బార్ మైసమ్మ బోనాలు
దర్బార్ మైసమ్మ బోనాల నేపథ్యంలో శనివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. పురానాపూల్ జంక్షన్ నుండి జియాగూడ రోడ్డు మీదుగా 2J బస్ స్టాప్ వైపు వెళ్లే RTC బస్సులు మరియు నాలుగు చక్రాల వాహనాలను పురానాపూల్ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. యాదవ్ భవన్ నుండి కార్వాన్ రోడ్డు మీదుగా దర్బార్ మైసమ్మ ఆలయం వైపు వెళ్లే వాహనాలను ముర్గి చౌక్, తల్లాగడ్డ జంక్షన్ వద్ద మళ్లిస్తారు.
Hyderabad Traffic Restrictions | మహంకాళి ఆలయం..
అంబర్పేట మహంకాళి ఆలయంలో సైతం బోనాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లిస్తారు. ఉప్పల్ నుంచి చాదర్ఘాట్, MGBS వైపు వెళ్లే జిల్లా బస్సులు, సిటీ బస్సులు, భారీ వాహనాలతో సహా అన్ని రకాల వాహనాలను అంబర్పేట్ ఫ్లైఓవర్ మీదుగా అనుమతిస్తారు. రామంతాపూర్ వైపు నుండి ఆలయానికి వెళ్లే భక్తులు అంబర్పేట్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న ఎడమ బైలేన్ మీదుగా గాంధీ విగ్రహం వైపు వెళ్లాలి.
దీనిని కూడా చదవండి : KTR HILT Policy | అధికారంలోకి రాగానే ఆ పాలసీ రద్దు చేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు