అక్షరటుడే వెబ్డెస్క్: Secunderabad Cantonment Funds | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు బకాయిపడిన రూ. 33 కోట్ల నిధుల విడుదల వ్యవహారానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం తెలంగాణ హైకోర్టు ( Telangana High Court )ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదంటూ కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు జె.రామకృష్ణ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ఈ సందర్భంగా పలు కీలక , సంచలన వ్యాఖ్యలు చేసింది.
Secunderabad Cantonment Funds | కోర్టు ధిక్కరణ కేసులపై ..
అధికారులను పదే పదే కోర్టుకు రప్పించడం బాధాకరమని ధర్మాసనం పేర్కొంది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సందీప్ సుల్తానియాపై ఇప్పటికే ఎన్నో కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని, ఆయనపై ఉన్న అన్ని కేసుల్లో గనక శిక్ష విధిస్తే జీవితకాలం జైలులోనే గడపాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు చేసే తప్పుల వల్ల బాధ్యతాయుతమైన అధికారులు ఇలాంటి ఇబ్బందులు, కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
Secunderabad Cantonment Funds | సంక్షేమ పథకాలపై కామెంట్స్..
ఈ విచారణ సందర్భంగా ‘రైతుబంధు’ పథకంపై కూడా ధర్మాసనం స్పందించింది. రైతుబంధు మంచి పథకమే అయినప్పటికీ, సరైన వర్గీకరణ లేకపోవడం వల్ల కోటీశ్వరులు సైతం లబ్ధి పొందుతున్నారని పేర్కొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం నిజమైన అర్హులకు మాత్రమే అందాలని, ప్రస్తుతం సమాజంలో ఎందరో అనర్హులు కూడా వీటికి లబ్ధిదారులుగా మారుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు, కంటోన్మెంట్ బోర్డు బకాయి నిధులలో ఇప్పటికే కొంత మొత్తాన్ని విడుదల చేశామని, మిగిలిన బకాయిలను కూడా విడతలవారీగా చెల్లిస్తామని అధికారి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఇది కూడా చదవండి: Abhijit Dipke | మోహన్ భగవత్ వ్యాఖ్యలపై స్పందించిన అభిజిత్ దీప్కే