అక్షరటుడే, వెబ్డెస్క్ : BJP President | ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) అన్నారు. భువనగిరి నియోజకవర్గంలోని పలు కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు.
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులపై బీజేపీ అధ్యక్షుడు రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా.. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదన్నారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్య వైఖరి కారణంగా తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు.
BJP President | లారీలు లేవు
పది రోజులుగా లారీలు రావడం లేదని, దీంతో కాంటాలు నిలిపివేశారని రాంచందర్రావు అన్నారు. కనీసం టార్పాలిన్లు కూడా లేవని, అకాల వర్షాలతో వడ్లు తడిసిపోతున్నాయన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మద్దతు ధరతో పాటు రవాణా, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, హమాలీ చార్జీలు, చివరికి ఐకేపీ కేంద్రాల కమిషన్ను కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. అయినా కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
BJP President | నష్టపోతున్న రైతులు
వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు వారిని మోసం చేస్తోందన్నారు. ధాన్యం కుప్పలపై కప్పడానికి కనీసం టార్పాలిన్లు లేవన్నారు. రోజుల తరబడి ధాన్యం ఉండిపోతుండటంతో బరువు తగ్గి రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. అలాగే అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మొద్దునిద్ర వీడి, మొలకెత్తిన ధాన్యం సహా ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు వసతులు కల్పించాలన్నారు.
ఇది కూడా చదవండి..: Hanumantha Rao Appointment | ప్రభుత్వ సలహాదారుగా వీహెచ్ నియామకం

