Chennai Out IPL 2026 | ఘోరంగా సీజ‌న్‌ని ముగించిన చెన్నై.. టాప్‌లో ఆర్సీబీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chennai Out IPL 2026 | చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టుకు ఐపీఎల్ 2026 సీజన్ చివరి మ్యాచ్ తీవ్ర నిరాశను మిగిల్చింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో చెన్నైని పూర్తిగా కట్టడి చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన గుజరాత్ భారీ విజయాన్ని నమోదు చేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు మొదటి నుంచే దూకుడుగా ఆడుతూ సీఎస్‌కే బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. సాయి సుద‌ర్శ‌న్ 53 బంతుల్లో 84 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, శుభ్‌మ‌న్ గిల్ 64 పరుగులతో రాణించాడు.

Chennai Out IPL 2026 | ముగిసిన చెన్నై ప్ర‌యాణం..

చివర్లో జాస్ బ‌ట్ల‌ర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ కేవలం 27 బంతుల్లోనే అజేయంగా 57 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ పవర్‌ప్లేలోనే చెన్నై బ్యాటింగ్‌ను చీల్చిచెండాడాడు. తొలి బంతికే వికెట్ తీసిన సిరాజ్, తన తదుపరి ఓవర్లలో వరుసగా కీలక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు మరో ఇద్దరు బ్యాటర్లను తక్కువ వ్యవధిలోనే ఔట్ చేసి సీఎస్‌కేను కోలుకోలేని స్థితిలోకి నెట్టాడు.

Chennai Out IPL 2026 | ఒత్తిడిని తట్టుకోలేక వరుసగా వికెట్లు

తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ఒత్తిడిని తట్టుకోలేక వరుసగా వికెట్లు కోల్పోయారు. శివం దూబే 47 పరుగులతో కొంత పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. చివరకు చెన్నై 13.4 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ అయింది. బౌలింగ్‌లో సిరాజ్‌తో పాటు క‌గిసో ర‌బాడా, ర‌షీద్ ఖాన్ తలో మూడు వికెట్లు తీసి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌ను చేదు జ్ఞాపకాలతో ముగించింది. అభిమానులు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోవడంతో సీఎస్‌కేకు ఇది నిరాశపరిచే సీజన్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ఆర్సీబీ టాప్‌లో ఉంది.

ఇది కూడా చదవండి..: IPL Tickets | ఉప్పల్​ స్టేడియం దగ్గర బ్లాక్​ టికెట్ల దందా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *