అక్షరటుడే నిజామాబాద్ సిటీ: DCC Nizamabad | సీఎం, మంత్రుల అవినీతిపై ఆధారాలు చూపే దమ్ము ఎంపీ అర్వింద్కు (MP Arvind) ఉందా అని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి (Nagesh Reddy) ప్రశ్నించారు. ఈ మేరకు నగరంలోని కాంగ్రెస్ భవన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
DCC Nizamabad | ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం..
ఓవైపు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ పరీక్ష(NEET) పేపర్ లీక్కారణంగా ఎందరో యువకుల జీవితాలు రోడ్డు పాలయ్యాయని.. వారంతా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని నగేష్ రెడ్డి అన్నారు. ఆ విషయాన్ని కప్పి పెట్టేందుకు రాష్ట్రంలో సీఎం, మంత్రులపై పసలేని ఆరోపణలు చేస్తూ నీట్ విషయాన్ని ఎంపీ అర్వింద్ పక్కదారి పట్టిస్తున్నారన్నారు.
DCC Nizamabad | యూరియా యాప్..
యూరియా (Uria) యాప్ అనేది కేవలం తెలంగాణలో (Telangana) మాత్రమే లేదని అన్ని రాష్ట్రాల్లోనూ అమలులో ఉందని నగేశ్ రెడ్డి వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ యాప్ పనిచేస్తోందన్నారు. దాని గురించి ఎంపీ అర్వింద్ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. కేంద్రం యూరియా పంపితేనే రాష్ట్రంలో డిస్ట్రిబ్యూట్ చేస్తామని.. కేంద్రం పంపకపోతే రాష్ట్రంలో రైతులకు ఎలా సరఫరా చేస్తామన్నారు. యూరియా యాప్ ద్వారా ఎకరాలను బట్టి విడతల వారీగా యూరియా సరఫరా జరుగుతుందని చెప్పారు. యూరియా యాప్ కేంద్ర ప్రభుత్వమే తీసుకువచ్చిందని స్పష్టం చేశారు. యాప్ గురించి తెలియని వారి కోసం గ్రామస్థాయిలో పంచాయతీలలో ఏఈవోలను మండల స్థాయిలో ఏవోలకు బాధ్యతలు అప్పజెప్పామన్నారు.
DCC Nizamabad | 12ఏళ్లుగా అభివృద్ధి శూన్యం..
నరేంద్ర మోదీ 12 ఏళ్లు ప్రధానమంత్రిగా దేశానికి చేసిన అభివృద్ధి శూన్యమని నగేష్రెడ్డి అన్నారు. గుండు పిన్ను కూడా తయారుచేసుకోలేని స్థాయిలో ఉన్న దేశాన్ని జవహర్ లాల్ నెహ్రూ ప్రపంచ స్థాయిలో నిలబెట్టారన్నారు. ఏడేళ్లుగా ఎంపీగా ఉన్న అర్వింద్ నిజామాబాద్ పార్లమెంట్కు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. రైల్వే బ్రిడ్జి పనులు నత్తనడకన నడుస్తున్నాయని పసుపు బోర్డు పేరుకే తీసుకువచ్చారని.. ఆఫీస్లో కనీసం సిబ్బందిని సైతం నియమించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు మూడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను రూ.600 కోట్ల నిధులతో మంజూరు చేయించారన్నారు. అదేవిధంగా వ్యవసాయ, ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయడంలో మహేష్ కుమార్ గౌడ్ ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో నుడా ఛైర్మన్ కేశ వేణు, డీసీసీ కోశాధికారి భక్తవస్థలం, డీసీసీ ఉపాధ్యక్షుడు రత్నాకర్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, డీసీసీ కార్యదర్శి గణేష్, కరీముద్దీన్, మొయిన్, మహమ్మద్ వాలి తదితరులు పాల్గొన్నారు.
