Nizamabad Child Death | నిజామాబాద్‌లో విషాదం..వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు బలి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nizamabad Child Death | తల్లిదండ్రులు తమ తమ బిడ్డకి చిన్నపాటి అస్వస్థత చేస్తే, నయమవుతుందన్న నమ్మకంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ, ఆ నమ్మకమే వారి పాలిట శాపమైంది. వైద్యుల నిర్లక్ష్యం ఆ దంపతుల సంతానాన్ని చిదిమేసింది. 16 నెలల పసికందు ప్రాణం గాలిలో కలిసిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Nizamabad Child Death | అసలేం జరిగిందంటే..

జక్రాన్‌పల్లి మండలం (Jakranpalli Mandal) పడకల్ తండాకు చెందిన శిరీష, నరేష్ దంపతుల కుమారుడు నిక్షిత్ (16 నెలలు). సోమవారం రాత్రి బాబుకు వాంతులు, విరేచనాలు కావడంతో నీరసించిపోయాడు. దీంతో హుటాహుటిన జిల్లా కేంద్రంలోని సెక్యూర్ చైల్డ్ కేర్ ఆస్పత్రికి తరలించారు. బాబును పరీక్షించిన వైద్యులు.. రక్తహీనత ఉందని, హార్ట్ బీట్ తక్కువగా ఉందని చెబుతూ చికిత్స ప్రారంభించారు.

Nizamabad Child Death | ప్రాణం తీసిన మందు..

చికిత్స పొందుతున్న క్రమంలో బాబు ఒంటిపై దద్దుర్లు రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యులను ప్రశ్నించారు. వారు గ్లూకోజ్ సెలైన్‌లో ఇంజెక్షన్ ఇచ్చి ఎక్కించారు. అయితే మంగళవారం ఉదయం ఎంఆర్ఐ స్కాన్ (MRI Scan) తీయించి తీసుకురాగానే బాబు పరిస్థితి విషమించింది. కాసేపటికే బాబు కన్నుమూశాడని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

Nizamabad Child Death | ఆస్పత్రి ఆవరణలో బంధువుల ఆందోళన..

తమ కళ్ల ముందే ఆడుకోవాల్సిన బిడ్డ విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. “మా బిడ్డను అన్యాయంగా చంపేశారు” అంటూ ఆస్పత్రి ముందు బంధువులు, తండా వాసులు ఆందోళనకు దిగారు. పండంటి బాబును నిర్లక్ష్యంతో పొట్టనబెట్టుకున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తత నెలకొనడంతో ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Nizamabad Child Death | విచారణ జరుపుతున్న పోలీసులు..

ఈ ఘటనపై బాబు తండ్రి నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాబు మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపారు. 16 నెలల ప్రాయంలోనే ఆ పసికందు లోకాన్ని విడిచి వెళ్లడం ఆ తండాలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇది కూడా చదవండి..: Kamareddy District Court | గంధపు చెట్లపై ఆశతో కౌలురైతు హత్య.. చివరికి కటకటాల వెనక్కి..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *