అక్షరటుడే, వెబ్డెస్క్ : Delimitation | దేశంలో లోక్సభ స్థానాల పునర్విభజన (డీలిమిటేషన్) సమయంలో సీట్ల విభజనను ఒక నిర్దిష్ట లక్ష్యంతో చేపట్టేందుకు, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. కేవలం జనాభా పంపిణీని మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా రూపొందించిన ఈ విధానం అన్ని పెద్ద రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్ల నిష్పత్తిని అలాగే కొనసాగిస్తుంది.
ఆర్థిక సలహా మండలి ప్రతిపాదన ప్రకారం.. కేరళ (Kerala) లోక్సభ సీట్లు 20 నుంచి 30కి, తమిళనాడు సీట్లు 39 నుండి 59కి, ఉత్తరప్రదేశ్ సీట్లు 80 నుండి 120కి పెరుగుతాయి. ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన (పార్లమెంటులో ఆమోదం పొందలేదు) డీలిమిటేషన్ సంబంధిత బిల్లులలోని అంశాలకు ఇది దాదాపుగా సరిపోలింది.
Delimitation | అక్కడ డబుల్
ఈ ప్రమాణాలను అనుసరిస్తే మిజోరాం, పుదుచ్చేరి, సిక్కిం, లడఖ్, అండమాన్, నికోబార్ దీవులు, నాగాలాండ్, చండీగఢ్, లక్షద్వీప్ వంటి చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో లోక్సభ సీట్ల సంఖ్య రెట్టింపు అవుతుందని సలహా మండలి పేర్కొంది. ప్రస్తుతం ఉన్న 543 సీట్లలో, మొత్తం 170 సీట్లను విభజించాలని EAC-PM నమూనా సూచిస్తోంది. ఇందులో 59 నియోజకవర్గాలను రెండుగా, 111 నియోజకవర్గాలను మూడుగా విభజించాలని సిఫార్సు చేసింది.
Delimitation | మొత్తం 824 సీట్లు
ఆర్థిక సలహా మండలి ప్రతిపాదన మేరకు లోక్సభ (Lok Sabha) పరిమాణం 824 సీట్లకు పెరుగుతుంది. మండలి అంచనా ప్రకారం, దీనివల్ల దక్షిణ భారత రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు) మొత్తం లోక్సభ సీట్ల వాటా ప్రస్తుతం ఉన్న 23.7 శాతం నుంచి 23.6 శాతానికి మారుతుంది. అత్యధిక జనాభా కలిగిన ఆరు ఉత్తర భారత రాష్ట్రాల (రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, మహారాష్ట్ర) వాటా ప్రస్తుతం ఉన్న 45.6 శాతం నుంచి 45.2 శాతానికి తగ్గుతుంది.
దీనిని కూడా చదవండి : Nipah Virus Kerala | కేరళలో మళ్లీ ‘నిఫా’ కలకలం.. ఒకరికి పాజిటివ్
