అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Dharmendra Pradhan Resignation | బీజేపీలో పదవులు ముఖ్యం కాదని.. దేశం బాగుండడమే ముఖ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
Dharmendra Pradhan Resignation | అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..
బీజేపీకి దేశం ముందు అని.. ఆ తర్వాతే పార్టీ అని దినేష్ (Dinesh Kulachari) పేర్కొన్నారు. ఆ సిద్ధాంతానికి కట్టుబడే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారన్నారు. నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో ఆయన తప్పు ఏమీ లేకపోయినా, నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రయోజనాల కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఆయన రాజీనామాతో ప్రధాని మోదీ ఓడిపోయారని కొంత మంది దేశ వ్యతిరేక శక్తులు రాక్షసానందం పొందుతున్నాయని పేర్కొన్నారు.
Dharmendra Pradhan Resignation | పాఠ్యాంశాల నుంచి అక్బర్, బీర్బల్ చరిత్ర తొలగింపు
పాఠ్యాంశాల నుంచి అక్బర్, బీర్బల్, మొఘలుల చరిత్రను తొలగించి, ఈ దేశపు గొప్ప మహనీయుల చరిత్రను పాఠ్యాంశాలుగా కేంద్ర విద్యాశాఖ చేర్చిందన్నారు. అప్పటినుంచి ప్రధాని నరేంద్ర మోదీ, ధర్మేంద్ర ప్రధాన్పై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తమ అక్కసును వెళ్లగక్కుతున్నారన్నారు. నీట్ పేపర్ లీక్ అయిన వెంటనే ప్రధాని మోదీ ప్రత్యేక చొరవ తీసుకుని, విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం కోల్పోకుండా వెంటనే తిరిగి పరీక్షలు నిర్వహించేలా ఆదేశించారన్నారు. ఇది ప్రధాని నైతికతకు నిదర్శనమన్నారు.
Dharmendra Pradhan Resignation | విద్యార్థుల పేరుతో ధర్నాలు.. రాస్తారోకోలు..
ఇటీవల విద్యార్థుల పేరుతో ధర్నాలు చేసిన వారు విదేశీ శక్తుల ధనబలంతో, వారి ప్రేరేపణతోనే ఈ ఆందోళనలు చేశారని దినేష్ ఆరోపించారు. విద్యార్థుల ముసుగులో చేసిన ఈ ఆందోళనల్లో శ్రీరాముడిని, సీతమ్మ తల్లిని, భారతమాతను అవమానించారని.. ఇది విద్యార్థుల ఆందోళనలా కాకుండా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, రాజస్థాన్ లతో పాటు కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో పీయూసీ (PUC), పీఎస్సీ (PSC), గ్రూప్-బి పరీక్షల పేపర్లు లీక్ అయినప్పుడు అక్కడి ముఖ్యమంత్రులు లేదా విద్యాశాఖ మంత్రులు ఎవరైనా రాజీనామా చేయలేదన్నారు. రాజస్థాన్ కాంగ్రెస్ మంత్రి గోవింద్ సింగ్ను ప్రశ్నిస్తే ‘నాకేం సంబంధం, అది అధికారుల బాధ్యత’ అని అని తప్పించుకున్నారన్నారు.
Dharmendra Pradhan Resignation | తెలంగాణలోనూ..
తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో ఇంటర్, ఎస్సెస్సీ, గ్రూప్-1, 2, 3 పేపర్లు లీక్ అయినప్పుడు ఎవరైనా బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారా..? అప్పటి మంత్రి కేటీఆర్ను ప్రశ్నిస్తే ‘ఆ పరీక్షలకు నాకేం సంబంధం’ అని బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్పారని దినేష్ గుర్తు చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి క్యాండిల్ ర్యాలీలు తీయడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో నాయకులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, ప్రమోద్ కుమార్, జ్యోతి, శివ ప్రసాద్, ఓం సింగ్, కిషోర్, రాము, కల్పే అర్చన, పిల్లి శ్రీకాంత్, విజయ్, పురుషోత్తం, అన్నం గోపి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Bellal GP Funds Misuse | జీపీలో నిధుల దుర్వినియోగంపై ప్రజావాణిలో ఫిర్యాదు