అక్షరటుడే, వెబ్డెస్క్: DSP Bheem Reddy ACB | తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS) విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (Dy.SP)గా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమ్రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కేసు నమోదు చేశారు.
ఆదాయానికి మించిన ఆస్తులు (Disproportionate Assets) కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు గురువారం (july 2, 2026) ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన మరో 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో షాకింగ్ వివరాలు వెలుగుచూశాయి. భీమ్రెడ్డి తన సర్వీస్ కాలంలో అవినీతి, అక్రమ మార్గాల ద్వారా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ప్రెస్ నోట్లో పేర్కొంది.
DSP Bheem Reddy ACB | లభ్యమైన స్థిరాస్తుల జాబితా
సోదాల్లో మొత్తం 20కి పైగా విలువైన స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
హైదరాబాద్లో విల్లా, ఇళ్లు: ఇబ్రహీంబాగ్లోని వెస్సెల్లా మెడోస్లో ఒక విలాసవంతమైన విల్లా, టెలికాం నగర్లో ఒక G+2+పెంట్ హౌస్ నివాసం.
ఫ్లాట్లు: టెలికాం నగర్లోని సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలోని క్రాంతి సియాన్ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్, తెల్లాపూర్లోని అభినంద రెసిడెన్సీలో రెండు నివాస ఫ్లాట్లు.
కమర్షియల్ కాంప్లెక్స్ & స్థలాలు: మణికొండ ల్యాంకో హిల్స్ రోడ్డులో 500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న G+5 కమర్షియల్ కాంప్లెక్స్లో వాటా, మణికొండ మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో 3000 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్.
ప్లాట్లు: ప్రగతి రిసార్ట్స్లో 500 చదరపు గజాల ఓపెన్ ప్లాట్, నాగోలు కామినేని హాస్పిటల్ సమీపంలో 200 చదరపు గజాల ప్లాట్, పటాన్చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 చదరపు గజాల ప్లాట్, పటాన్చెరులో మరొక 200 చదరపు గజాల ఓపెన్ ప్లాట్.
వ్యవసాయ భూములు: సంగారెడ్డి జహీరాబాద్లో 3.5 ఎకరాలు, వికారాబాద్ మోమిన్పేటలో 1,000 చదరపు గజాల ల్యాండ్ పార్సిల్తో పాటు 2 ఎకరాల వ్యవసాయ భూమి. సి.సి.కుంట ముచింతల గ్రామంలో 4 ఎకరాల 20 గుంటల భూమి.
కర్ణాటకలో ఆస్తులు: కర్ణాటకలో ఒకచోట 6 ఎకరాలు, మరోచోట 38 ఎకరాల భారీ వ్యవసాయ భూమి, బెంగళూరు దేవనహళ్లిలో 1 ఎకరం భూమి.

DSP Bheem Reddy ACB | నగదు, బంగారం, పెట్టుబడులు
కేవలం స్థిరాస్తులే కాకుండా భీమ్రెడ్డి నివాసంలో, ఆయన బినామీ ఇంట్లో భారీగా నగదు, బంగారం లభ్యమయ్యాయి.
నగదు: డీఎస్పీ ఇంట్లో ₹3.60 లక్షలు, బినామీ ఇంట్లో ₹40 లక్షలు… మొత్తంగా ₹43.60 లక్షల నెట్ క్యాష్.
బంగారు, వెండి ఆభరణాలు: సుమారు 2 కిలోల బంగారు నగలు, మరియు 20 కిలోల వెండి వస్తువులు.
బ్యాంక్ బ్యాలెన్స్: వివిధ బ్యాంకు ఖాతాల్లో దాదాపు ₹19.91 లక్షల సొమ్ము.
వ్యాపార పెట్టుబడులు: DSP Bheem Reddy ACB | ‘మెసర్స్ శ్రీ రాఘవేంద్ర రాక్ శాండ్ మినరల్స్’ కంపెనీలో ₹75,00,000 పెట్టుబడి పెట్టినట్లు పత్రాలు లభ్యమయ్యాయి.
దీనితో పాటు నిబంధనలకు విరుద్ధంగా 23 విదేశీ మద్య బాటిళ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల విలువ కంటే వీటి ప్రస్తుత మార్కెట్ విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అవినీతి కేసుపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.