అక్షరటుడే, వెబ్డెస్క్ : Employee Health Scheme | ప్రత్యేక ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ ద్వారా ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రెండు రోజుల్లో ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (CS Ramakrishna Rao) ప్రకటించారు. వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చేసిన సూచనలు, సిఫార్సులను పొందుపరిచిన తర్వాత ట్రస్ట్ ఏర్పాటు, పనితీరుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలను రూపొందిస్తామన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల కోసం ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడం, క్రమబద్ధీకరించడం కోసం అనుసరించాల్సిన విధివిధానాలపై సీఎస్ సోమవారం సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు, తెలంగాణ వ్యాప్తంగా సేవలందిస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండే, నాణ్యమైన, అవాంతరాలు లేని ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
Employee Health Scheme | ప్రత్యేక బ్యాంక్ ఖాతా
ట్రస్ట్ కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతాను తెరుస్తామని, ప్రభుత్వం, ఉద్యోగుల నుంచి సమానమైన ఆర్థిక వాటాలతో దానిని నిర్వహిస్తామని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ట్రస్ట్ పూర్తి స్వయంప్రతిపత్తితో పనిచేస్తుందని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం దానికి ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బెన్హర్ మహేష్ ఎక్కా, దాన కిషోర్, ప్రధాన కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, క్రిస్టినా జోంగ్తు, యోగితా రాణా తదితరులు ఉన్నారు. వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరై సీఎస్కు వినతి పత్రాలు సమర్పించారు.
దీనిని కూడా చదవండి : Rayadurgam Land Auction | రాయదుర్గంలో ఆకాశాన్ని తాకిన ల్యాండ్ రేట్లు.. ఎకరా ఎంతంటే!


