అక్షరటుడే, వెబ్డెస్క్ : Fake Currency Gang | ఇన్స్టాగ్రామ్, కలర్ జిరాక్స్ మెషిన్ ద్వారా నడుస్తున్న ఒక నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వైన్ షాపులో బీర్ కొనుగోలు చేయడానికి నకిలీ రూ. 500 నోట్లను వాడటంతో ఈ వ్యవహారం బయటపడింది;
ఒక వైన్ షాపులో బీరు కొనడానికి నకిలీ రూ. 500 నోట్లను ఉపయోగించడంతో ఈ దందా బట్టబయలైంది. దీంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు సహా ఏడుగురిని అరెస్టు చేశారు. నాగర్కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. బిజినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళనూరు గ్రామంలోని ఒక ఇంట్లో నిందితులు నకిలీ రూ. 500 నోట్లను ముద్రిస్తున్నారు. వాటిని వైన్ షాపులు, దాబాలు, కిరాణా దుకాణాలు, పెట్రోల్ బంకులలో చలామణి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Fake Currency Gang | పట్టించిన కౌంటింగ్ మిషన్
ఆగస్టు 1న మంగళనూరులోని కనకదుర్గ వైన్స్లో ఒక వినియోగదారుడు రెండు నకిలీ రూ. 500 నోట్లతో బీరు కొనుగోలు చేయడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. కౌంటింగ్ మిషన్ రెండు ఫేక్ నోట్లను గుర్తించింది. దీంతో దుకాణం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారి నుంచి రూ. 68,000 విలువైన నకిలీ నోట్లతో పాటు, ఒక కలర్ జిరాక్స్ మెషీన్, కాటన్ లినెన్ పేపర్, కరెన్సీ లెక్కింపు యంత్రం, నకిలీ కరెన్సీ ముద్రణకు ఉపయోగించే ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
Fake Currency Gang | ఇన్స్టాగ్రామ్ ద్వారా దందా
ప్రధాన నిందితుడు కాలిదిండి నాగరాజు ఆర్థిక ఇబ్బందుల కారణంగా నకిలీ నోట్ల తయారీ ప్రారంభించాడు. నలుగురు సహచరులతో కలిసి కాటన్ లినెన్ కాగితాన్ని ఉపయోగించి నకిలీ కరెన్సీని ముద్రించేవాడు. ముడుండి శివ వెంకట ధర్మరాజు (A2) ఇన్స్టాగ్రామ్ ద్వారా వంగ నవీన్ గౌడ్ (A5)ను సంప్రదించి, ప్రతి రూ.1,000 అసలు నగదుకు రూ. 4,000 నకిలీ కరెన్సీ చొప్పున ఆఫర్ చేశాడని పోలీసులు గుర్తించారు. అరెస్టయిన వారిలో మీ-సేవ ఆపరేటర్, ఆక్వా టెక్నీషియన్, వీడియో ఎడిటర్, హోటల్ వ్యాపారి, సాఫ్ట్వేర్ ఉద్యోగి, ఇద్దరు రైతులు ఉన్నారు. నిందితులలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కాగా, ఇద్దరు తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాకు చెందినవారు.
దీనిని కూడా చదవండి : Wife Texted Lover | ఎలాగైనా నా భర్తను చంపు.. ప్రియుడికి మెసేజ్ చేసిన భార్య