అక్షరటుడే వెబ్డెస్క్: Nizamabad Haribabu Murder | యూట్యూబర్ వైష్ణవి హత్యకు ప్రతీకారంగానే నిజామాబాద్లో హరిబాబును ఆమె సోదరుడు సంతోష్ అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ కేసులో నిందితుడు సంతోష్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఈ హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
Nizamabad Haribabu Murder | అసలు ఏం జరిగిందంటే?
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన హరిబాబు.. వైష్ణవి (19)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, మార్చి 17న వైష్ణవి 4 నెలల గర్భిణిగా ఉన్న సమయంలో ఆమెను గొంతు నులిమి, కత్తితో పొడిచి హరిబాబు కిరాతకంగా చంపాడు. ఈ కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న హరిబాబు.. ఆగస్టు 15న బెయిల్పై బయటకొచ్చాడు. ప్రాణభయంతో అనంతపురంలో ( Anantapur )విగ్రహాల తయారీ కేంద్రంలో తలదాచుకున్నాడు. కొన్ని రోజుల క్రితం నిజామాబాద్లో ఉంటున్న తన తల్లిని చూసేందుకు హరిబాబు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న వైష్ణవి సోదరుడు సంతోష్ పక్కా ప్లాన్ వేసి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు.
Nizamabad Haribabu Murder | కత్తితో దాడి..
ఈ నెల 17న సాయంత్రం నిజామాబాద్లోని ఆర్ఆర్ చౌరస్తా వద్ద పానీపూరి బండి దగ్గర నీళ్లు తాగుతున్న హరిబాబుపై సంతోష్ కారులో వచ్చి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే తల, మెడ, నడుము భాగాల్లో 9 సార్లు నరికాడు. తీవ్ర రక్తస్రామై హరిబాబు తన తల్లి కళ్లముందే అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ భయానక హత్య దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డై తీవ్ర కలకలం సృష్టించాయి. సరిగ్గా ఆరు నెలల క్రితం (మార్చి 17న) భర్త చేతిలో వైష్ణవి హత్యకు గురికాగా, అదే తేదీన (సెప్టెంబర్ 17న) ఆమె సోదరుడి చేతిలో హరిబాబు హతమవడం గమనార్హం.
Nizamabad Haribabu Murder | పోలీసుల దర్యాప్తు ..
హత్య అనంతరం సంతోష్ ఆంధ్రప్రదేశ్కు పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు నిజామాబాద్ బైపాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు, రెండు కర్రలు, కారును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. ఈ హత్యలో సంతోష్తో పాటు అతడి తల్లి గంధం రాణి, పెద్దమ్మ కుమారులు చరణ్, రంజిత్ కూడా నేరాన్ని ప్రోత్సహించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మిగతా నిందితుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని సీపీ సాయి చైతన్య స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: BMW Accident | బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బీఎండబ్ల్యూ కారు : ముగ్గురి మృతి