అక్షరటుడే, వెబ్డెస్క్: Gig workers Telangana | తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)ను కలిశారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు.
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం, 2012 తర్వాత ఆటో ఛార్జీల పెంపుపై ప్రభుత్వం చర్యలు చేపట్టడంపై యూనియన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ను త్వరితగతిన అమలు చేయాలని, యాప్ ఆధారిత రవాణా రంగంలో పనిచేస్తున్న ఆటో, క్యాబ్, సరుకుల రవాణా వాహనాల డ్రైవర్లకు న్యాయం జరిగేలా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. యాప్ ఆధారిత ప్రయాణీకుల, సరుకుల రవాణాకు ఉపయోగించే ప్రైవేట్ వాహనాల విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, అవసరమైన చోట మోటార్ వెహికల్స్ చట్టం–1988 ప్రకారం వాణిజ్య రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేయాలని కోరారు.
Gig workers Telangana | ఛార్జీలు పెంచాలి..
పెరుగుతున్న ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చులు, డ్రైవర్ల జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకుని హైర్ వెహికల్ ఛార్జీలను కూడా పెంచాలని యూనియన్ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఆటో, క్యాబ్, గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందేలా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Revanth Owaisi Alliance | అప్పట్లో మాటల తూటాలు.. ఇప్పుడు దోస్తీ..రేవంత్-ఒవైసీల కొత్త రాజకీయం వెనుక అసలు వ్యూహమేంటి?