అక్షరటుడే వెబ్డెస్క్: HYDRA Commissioner | హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్ను తప్పించాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha )స్పందించారు. హైడ్రా కమిషనర్ను తొలగించాలని కోర్టు ఆదేశించడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి అద్దం పడుతోందని ఆమె ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అక్రమ కట్టడాల పేరుతో పేదల ఇళ్లను ఇష్టానుసారంగా కూల్చివేస్తున్న ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని అన్నారు.
HYDRA Commissioner | ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి..
కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘిస్తున్న హైడ్రా తీరుపై గతంలో న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని కవిత హితవు పలికారు. పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం అనే ధోరణిని పక్కనపెట్టి ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ భూమి విషయంలో హైకోర్టు ఆదేశాలను రంగనాథ్ ఉల్లంఘించారని, ఆయనపై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని పేర్కొంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
HYDRA Commissioner | వివాద నేపథ్యం..
ఇటీవల హైడ్రా తీరుపై కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాను తీసుకువచ్చిందని మండిపడ్డారు. ఇటీవల గండిపేట మండలం నార్సింగ్లో ఒక ప్రైవేట్ సంస్థ మూసీ నది మధ్యలో చేపట్టిన నిర్మాణాలపై ఆందోళన చేస్తే, హైడ్రా తమనే బద్నాం చేయడానికి ప్రయత్నిస్తోందని కమిషనర్ రంగనాథ్ తీరుపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో “మిస్టర్ రంగనాథ్.. మిమ్మల్ని మేము కోర్టుకు ఈడిస్తాం” అంటూ ఆమె హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా హైకోర్టు రంగనాథ్ను తొలగించాలని ఆదేశించడంతో ఆమె మరోసారి స్పందించారు.
ఇది కూడా చదవండి: IndiGo Emergency Landing | విమానంలో పొగలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్