అక్షరటుడే, వెబ్డెస్క్ : HYDRAA Land Protection | హైదరాబాద్ (Hyderabad) నగరంలో హైడ్రా మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఏకంగా రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడింది.
మాదాపూర్ సైబర్ టవర్స్ (Cyber Towers)కు చేరువలో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా బుధవారం కాపాడింది. హైకోర్టు తీర్పు మేరకు హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. ఈ భూమి విలువ దాదాపు 3 వేల కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్లోని 41/12, 13, 14 సర్వే నంబర్లలో మొత్తం 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి తమదంటూ ఇట్టినా ప్రాపర్టీస్ సంస్థ క్లైమ్ చేస్తూ వస్తోంది. ఆ భూములను ఖాళీ చేయాలని కోరుతూ 2016లో టీజీఐఐసీ వాళ్లు ఇట్టినా ప్రాపర్టీస్ సంస్థకు నోటీసులు జారీ చేశారు.
HYDRAA Land Protection | నకిలీ పత్రాలు
ఈ నోటీసులను సవాల్ చేస్తూ ఇట్టినా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. మాజీ సైనికుల కోటా కింద ప్రభుత్వం 1963లో ఆ భూమి కేటాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని.. పిటిషనర్ సమర్పించిన పట్టా పత్రాలు నకిలీవని రెవన్యూ అదికారులు ఆధారాలతో కోర్టుకు నివేదించారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని కొట్టేయాలని పిటిషనర్లు ప్రయత్నిస్తున్నారని కోర్టు నిర్ధారించుకుని.. ఆ భూములను రక్షించాలని రెవెన్యూ అదికారులను ఆదేశించింది. రెవెన్యూ అధికారుల విజ్ఞప్తి మేరకు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది.
దీనిని కూడా చదవండి : Nanakramguda Drug Bust | కిరాణా షాపులో గంజాయి దందా.. గుట్టురట్టు చేసిన ఈగల్ టీం
