Insurance Murder | ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రియుడితో కలిసి భర్త హత్య

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను భార్య హత్య చేయించింది. ఈ ఘటన సదాశివనగర్​ మండలంలో చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Insurance Murder | వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో, ఇన్సూరెన్స్(Insurance) డబ్బుల కోసం భర్తను భార్య హత్య చేయించింది. కేసును ఛేదించిన పోలీసులు  భార్య, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు ఎల్లారెడ్డి (Yelalreddy) డీఎస్పీ శ్రీనివాస్ రావు బుధవారం రాత్రి వివరాలు వెల్లడించారు.

Insurance Murder | సదాశివనగర్​ మండలంలో..

సదాశివనగర్ (Sadashivanagar) మండలం మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల రాజయ్య (45) గత నెల 22న మృతి చెందాడు. ఆయన భార్య కంచర్ల రేణుక తన భర్త రాత్రి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుండగా గుర్తు తెలియని జంతువు అడ్డురావడంతో బైక్ అదుపు తప్పి మృతి చెందాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎల్లారెడ్డి (Yellareddy Police) డీఎస్పీ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో సీఐ సంతోష్ కుమార్ నేతృత్వంలోని బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. సాక్షుల వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, పోస్టుమార్టం నివేదికను క్షుణ్ణంగా పరిశీలించగా ఇది ప్రమాదం కాదని, తలపై బలంగా కొట్టడం వల్ల జరిగిన పక్కా ప్రణాళికాబద్ధమైన హత్యగా తేలింది. దర్యాప్తులో మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల గంగశేఖర్ (37) ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

Insurance Murder | వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

మృతుడి భార్య రేణుకతో గంగశేఖర్‌కు గత నాలుగేళ్లుగా అక్రమ సంబంధం ఉంది. భర్త రాజయ్య అడ్డుగా ఉన్నాడని, అతను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులను పొందవచ్చనే దురాశతో ఇద్దరూ కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఈ కుట్రలో భాగంగా గత నెల 21న గంగశేఖర్ రాజయ్యను గాంధారి ప్రాంతానికి పిలిపించి మద్యం తాగించాడు. అనంతరం తిర్మన్‌పల్లి గ్రామ శివారులో మత్తులో ఉన్న రాజయ్య తలపై ఐరన్ రాడ్‌తో బలంగా కొట్టి హత్య చేశాడు. ఘటనను రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించేందుకు మృతదేహం, మోటార్ సైకిల్‌ను అక్కడే ఉంచి పరారయ్యాడు.

పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్, మృతుడి మోటార్ సైకిల్, నిందితుల మొబైల్ ఫోన్లు, ఇతర సాంకేతిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కంచర్ల గంగశేఖర్, కంచర్ల రేణుకలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రమాదంగా కనిపించిన ఈ కేసును సూక్ష్మంగా దర్యాప్తు చేసిన సీఐ సంతోష్ కుమార్, ఎస్సై పుష్ప రాజు, ఎస్సై సిద్ధిక్, సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.

ఇది కూడా చదవండి : HYDRAA Land Protection | రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *