అక్షరటుడే, నిజామాబాబాద్ క్రైం: Godavari Pushkaralu | గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. పుష్కరాలు–2027పై డీజీపీ (DGP) (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీపీ శనివారం పాల్గొన్నారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడారు.
Godavari Pushkaralu | భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
సీపీ మాట్లాడుతూ.. జిల్లాలో (Nizamabad) పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణపై అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. అత్యవసర సేవల సమన్వయం, విపత్తు నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. పుష్కరాలు జరిగే రెంజల్, మెండోరా, ఏర్గట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పుష్కర ఘాట్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించారు.
Godavari Pushkaralu | భద్రతా ఏర్పాట్లు..
భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక పోలీస్ అవుట్పోస్టులను ఏర్పాటు చేయాలని సీపీ సూచించారు. ఆధునిక సౌకర్యాలతో కమాండ్ అండ్ కంట్రోల్ హాల్ నిర్మాణం, సీసీటీవీ కెమెరాల విస్తరణ, డ్రోన్ నిఘా, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, బ్యారికేడింగ్, పార్కింగ్ ప్రణాళిక, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. మహిళలు, చిన్నారులు , వృద్ధుల కోసం ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా పుష్కరాల సమయంలో భారీగా వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ నిర్వహణ, విపత్తు నిర్వహణ బృందాల సిద్ధత, అగ్నిమాపక, వైద్య, ఎన్డీఆర్ఎఫ్ /ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయంపై చర్చించారు. వీసీలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాశ్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి,మల్లేష్, నిజామాబాద్ గోదావరి పారివాక ప్రాంతంలోని సీఐలు, ఎస్సైలు, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.