Indiramma Housing Scheme | భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. వారికి కూడా ఇళ్లు! : మంత్రి పొంగులేటి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Housing Scheme | రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల అధికారులతో మంత్రులు ఉత్తమ్ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్​కుమార్​, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.

ప్రతి పేద కుటుంబానికి శాశ్వత గృహాన్ని అందించడానికి, భూ యజమానులకు స్పష్టమైన యాజమాన్య హక్కులను కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పొంగులేటి అన్నారు. పేదల జీవితాల్లో మార్పు తీసుకు రావడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెచ్చామన్నారు. ఇప్పటికే 4 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

Indiramma Housing Scheme | సమన్వయంతో పని చేయాలి

మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అమలు చేసేటప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే సమస్యలు తక్షణమే పరిష్కారం అవుతాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం కలెక్టర్లకు విస్తృత అధికారాలు అప్పగించామన్నారు. బిల్లులు సకాలంలో జమ చేయాలని ఆదేశించారు.

Indiramma Housing Scheme | అర్హులకే ఇళ్లు

ఇందిరమ్మ ఇళ్ల అమలులో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పొంగులేటి హెచ్చరించారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు అందేలా ఈ పథకాన్ని పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో అమలు చేయాలని సూచించారు. ఎలాంటి లోపాలు, నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు.

Indiramma Housing Scheme | వారికి మరో అవకాశం

గతంలో ఇందిరమ్మ పథకాల కింద ఇళ్లు మంజూరై, వివిధ కారణాలతో నిర్మాణం పూర్తి చేసుకోలేని లబ్ధిదారులకు మరో అవకాశం కల్పించే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. జిల్లాల్లోని హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు తమ బాధ్యతలను పూర్తి జవాబుదారీతనంతో నిర్వర్తించాలని, సమస్యల సత్వర పరిష్కారం కోసం లబ్ధిదారులకు, ఉన్నతాధికారులకు మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించాలని ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు.

Indiramma Housing Scheme | తహశీల్దార్ల నియామకం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల కోసం కొత్త భవనాలను నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. లక్షకు మించిన జనాభా ఉన్న మండలాల్లో అవసరాన్ని బట్టి అదనపు తహశీల్దార్లను నియమిస్తామని వెల్లడించారు. భూ వివాదాల పరిష్కారానికి రెవెన్యూ, అటవీ, ఇతర శాఖల సంయుక్త సర్వేలే ఏకైక మార్గం అన్నారు.

దీనిని కూడా చదవండి : ACB Raid | ఏసీబీ వలలో అటవీశాఖ అధికారులు.. రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *