అక్షరటుడే, వెబ్డెస్క్ : Inter Students Breakfast | రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్థాయి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం (Mid Day Meals) అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఉదయం అల్పాహారం (Breakfast)తో పాటు మధ్యాహ్న భోజనం అందించడానికి ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇంటర్ విద్యార్థులకు రోజు ఒకేరకమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా వెరైటీలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టిఫిన్లో దోశ, పూరీ, ఇడ్లీ, మిల్లెట్, బోండాపెట్టాలని భావిస్తోంది. వయసుకు తగిన పోషకాలు అందేలా పథకాన్ని రూపొందిస్తోంది. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 1.92 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, బ్రేక్ఫాస్ట్కు ఏటా రూ.180 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకాన్ని జూన్ 12న సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు.
Inter Students Breakfast | సక్రమంగా అమలయ్యేనా..
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలి. అయితే రాష్ట్రంలో ఏ బడిలో కూడా మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. నీళ్ల చారుతో సరిపెడుతున్నారు. కూరలు సరిగా వండటం లేదు. అన్నం, కూరల్లో పురుగులు వచ్చిన ఘటనలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం అమలు చేసే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తారా లేదో చూడాలి.

Inter Students Breakfast | టిఫిన్ మెనూ
ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని జూన్ 12న ప్రారంభిస్తారు. తొలి రోజు 41,250 మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, భోజనం అందించనున్నారు. దోశ+చట్నీ, మిల్లెట్ ఇడ్లీ+సాంబార్, +మిక్స్డ్ వెజిటెబుల్ కుర్మా, బోండా+చట్నీ, ఇడ్లీ+చట్నీ, ఉప్మా+చట్నీ/ సాంబార్ టిఫిన్గా అందించనున్నారు. అంతేగాకుండా రోజు విడిచి రోజు 150 మిల్లిలీటర్ల పాలు కూడా విద్యార్థులకు ఇవ్వనున్నారు.
దీనిని కూడా చదవండి : Panipuri Food Poisoning | పానీపూరి తిని 25 మందికి తీవ్ర అస్వస్థత


