IPL Playoff Race | ఆస‌క్తిక‌రంగా మారుతున్న ఐపీఎల్​ ప్లే ఆఫ్ పోరు..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL Playoff Race | ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (Indian Premier League 2026) సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంటున్న వేళ ప్రతి మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికపై భారీ ప్రభావం చూపుతోంది. తాజాగా జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన కీలక పోరులో గుజ‌రాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ గెలుపుతో గుజరాత్ జట్టు ఒక్కసారిగా ప్లే ఆఫ్ రేసులో బలమైన పోటీదారుగా మారింది. ఈ మ్యాచ్‌కు ముందు ఐదో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్.. భారీ విజయంతో నేరుగా రెండో స్థానానికి ఎగబాకడం విశేషం. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్, అందులో 7 విజయాలు సాధించి మొత్తం 14 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ జట్టుకూ 14 పాయింట్లే ఉన్నప్పటికీ, మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా హైదరాబాద్ టాప్‌లో కొనసాగుతోంది.

IPL Playoff Race |  ఉత్కంఠగా సీజన్​

గుజరాత్ నెట్ రన్‌రేట్ ప్రస్తుతం 0.228గా ఉంది. గుజరాత్ విజయం కారణంగా పాయింట్ల పట్టికలో ఉన్న ఇతర జట్లకు కూడా పెద్ద దెబ్బ తగిలింది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ (Punjab Kings), ఆర్సీబీ జట్లు ఒక్కో స్థానం కిందకు జారాయి. ఇప్పటివరకు రెండో స్థానంలో కొనసాగిన పంజాబ్ కింగ్స్ ఇప్పుడు మూడో స్థానానికి పరిమితమైంది. పంజాబ్ 10 మ్యాచ్‌లలో 13 పాయింట్లతో కొనసాగుతోంది. అలాగే 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న బెంగళూరు జట్టు ప్రస్తుతం నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన రాజస్థాన్ రాయల్స్‌కు ఇది డబుల్ షాక్‌గా మారింది. సొంత మైదానంలో ఘోర పరాజయం చవిచూడటమే కాకుండా టాప్-4 నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్‌కు ఇది ఐదో ఓటమి. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇక మిగిలిన మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన ఒత్తిడి ఆ జట్టుపై పడింది.

IPL Playoff Race | బ్యాట్స్​మెన్​ విఫలం

యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) నాయకత్వంలో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ నిరాశపరిచింది. కీలక సమయంలో బ్యాట్స్‌మెన్ విఫలం కావడం, బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడం ఆ జట్టుకు భారీ నష్టాన్ని మిగిల్చింది. మరోవైపు గుజరాత్ అన్ని విభాగాల్లో సమష్టి ప్రదర్శన కనబర్చింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్, గుజరాత్ జట్లు టాప్-2 స్థానాల్లో బలంగా కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన రెండు ప్లే ఆఫ్ స్థానాల కోసం పంజాబ్, బెంగళూరు, రాజస్థాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రతి మ్యాచ్ ఫలితం మారుతున్న కొద్దీ పాయింట్ల పట్టికలో కూడా భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను చూస్తుంటే ఈసారి కూడా టైటిల్ రేసులో బలమైన జట్టుగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ప్లే ఆఫ్ బెర్తుల కోసం మిగిలిన జట్ల మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.

gt

దీనిని కూడా చదవండి : KKR Playoff Hopes | ఢిల్లీపై గెలుపుతో కేకేఆర్ ప్లేఆఫ్ ఆశ‌లు స‌జీవం.. మ‌రి అక్ష‌ర్ సేన ప‌రిస్థితి ఏంటి?

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *