Iran US Conflict | అమెరికా దాడులకు ఇరాన్ హెచ్చరిక.. ‘చిత్తుచేసే ప్రతిస్పందన’ తప్పదన్న సైనిక కమాండ్

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran US Conflict | అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా చర్యలను “స్పష్టమైన దురాక్రమణ”గా అభివర్ణించిన ఇరాన్ అత్యున్నత సంయుక్త సైనిక కమాండ్ ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్.. దీనికి “చిత్తుచేసే ప్రతిస్పందన” తప్పదని ప్రకటించింది. అలాగే, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి నిర్వహణలో అమెరికా జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసింది.

Khamenei Funeral | “ఖమేనీ అంత్యక్రియలకు హాజరైనందుకు భారత్‌కు ఇరాన్ కృతజ్ఞతలు.. అమెరికా ఒత్తిడితో 13 దేశాలు దూరం”

Iran US Conflict | వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా..

అమెరికా సైన్యం మంగళవారం (జులై 7) ఇరాన్‌పై వైమానిక దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్య చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంలో నౌకలపై దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగించిందని పేర్కొంది.

అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ “శక్తివంతమైన” దాడులు చేపట్టినట్లు తెలిపింది. అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతను కాపాడేందుకే ఈ చర్య తీసుకున్నామని పేర్కొంది.

Iran US Conflict | వరుస పేలుళ్లు..

ఇదిలా ఉండగా, ఇరాన్ ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం హోర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో పలు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఖేష్మ్ ద్వీపంలో ఆరు పేలుళ్లు, సిరిక్ నగరంలో ఏడు పేలుళ్లు నమోదైనట్లు, అలాగే ప్రధాన నౌకాశ్రయ నగరం బందర్ అబ్బాస్‌లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలిపింది.

అమెరికా చర్యలపై ఇరాన్ విదేశాంగ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమెరికా పదేపదే ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. అమెరికా ఒప్పంద ఉల్లంఘనకు తగిన పరిణామాలు తప్పవని హెచ్చరిస్తూ, దేశ ప్రయోజనాలు, జాతీయ భద్రతను పరిరక్షించేందుకు అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గం కావడంతో, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *