అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police | గంజాయి (Ganja Case) మత్తులో ఇద్దరు దొంగలు పోలీసులకు చిక్కారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేష్ (SP Rajesh Chandra) చంద్ర వివరాలు వెల్లడించారు.
Kamareddy Police | తెలంగాణలోని పలు జిల్లాల్లో..
తెలంగాణలోని(Telanagana) పలు జిల్లాల్లో వరుసగా వాహన చోరీలు, మొబైల్ దోపిడీలు, షట్టర్ లిఫ్టింగ్, ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ముఠా సభ్యులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్నగర్ కాలనీలోని డీలక్స్ బేకరీ సమీపంలో గంజాయి సేవిస్తున్నారన్న పక్కా సమాచారంతో టౌన్ ఎస్సై సాయి కృష్ణ సిబ్బందితో మెరుపుదాడి చేశారు. అక్కడ పట్టుబడిన తిలిపితియ రూబిన్ సింగ్ అలియాస్ రూబీన్ సింగ్, మంగళ్ సింగ్లను విచారించగా అసలు గుట్టు రట్టయింది. ఇద్దరూ కామారెడ్డి రాజీవ్నగర్కు చెందినవారే కాగా.. గంజాయి, మద్యం, జల్సాలకు అలవాటుపడి దొంగతనాల బాట పట్టారు.
Kamareddy Police | సెల్ఫోన్లు చోరీ చేస్తూ..
జగద్గిరిగుట్ట, బాచుపల్లి, భిక్కనూర్(Bhikkanoor), దేవన్పల్లి, రాజంపేట, మాచారెడ్డి (Machareddy), కామారెడ్డి, పొచారం ఐటీ కారిడార్, ఘట్కేసర్, యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri), జనగామ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 కేసుల్లో వీరి హస్తం ఉన్నట్లు తేలింది. వీరు చోరీ చేసిన మొబైళ్లను అన్లాక్ చేయడంలో సహకరించిన షేక్ ముజాహిద్, ఆసం రాజేందర్లతో పాటు కామారెడ్డికి చెందిన సమీర్, శివలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వీరి నుంచి ఆరు మోటార్ సైకిళ్లు, 23 మొబైల్ ఫోన్లు, 95 గ్రాముల గంజాయి, రెండు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.
వరుస నేరాలకు చెక్ పెట్టి చోరీ సొత్తును రికవరీ చేసిన సీసీఎస్, టౌన్ పోలీస్ బృందాలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు వాహనాలను సురక్షిత ప్రదేశాల్లోనే పార్క్ చేసి వీల్ లాక్లు వాడాలని, మొబైళ్లలో ట్రాకింగ్ ఆన్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే డయల్-100కు సమాచారం ఇవ్వాలని, ప్రజల సహకారంతోనే నేరాలను అదుపు చేయగలమని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Etela Rajender Cantonment | కంచే చేను మేసినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది : ఈటల రాజేందర్