అక్షరటుడే, వెబ్డెస్క్ : Karimnagar Jewellery Robbery | కరీంనగర్లోని పీఎంజే జ్యూవెలరీ (PMJ Jewellery) షాపులో జరిగిన సంచలన దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఈ ఘటనను పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
దోపిడీకి పాల్పడింది బీహార్కు చెందిన ప్రొఫెషనల్ గోల్డ్ థీఫ్ గ్యాంగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా సభ్యులు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో దోపిడీలు, కిడ్నాప్లు, అక్రమ వసూళ్ల వంటి నేరాల్లో కూడా పాల్గొన్నట్లు వెల్లడైనట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వీరి నెట్వర్క్ విస్తరించి ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Karimnagar Jewellery Robbery | రెండు రోజుల ముందే రెక్కీ..
దోపిడీకి రెండు రోజుల ముందే ఈ గ్యాంగ్ సభ్యులు జగిత్యాల జిల్లా (Jagtial District) ధర్మపురిలో మకాం వేసినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి కరీంనగర్కు వచ్చి పీఎంజే జ్యూవెలరీ షాపును రెక్కీ చేసి, పక్కా ప్రణాళికతో దోపిడీకి పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. ఘటనలో ఉపయోగించిన ద్విచక్ర వాహనాలు, హెల్మెట్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఐదుగురు దుండగులు పాల్గొన్నారని భావించిన పోలీసులు, తాజాగా ఆరో వ్యక్తి కూడా ఉన్నాడనే అనుమానానికి వచ్చారు. దోపిడీ అనంతరం మిగతా సభ్యులను ఛత్తీస్గఢ్ లేదా ఝార్ఖండ్ వైపు తరలించడంలో ఆ ఆరో వ్యక్తి కీలక పాత్ర పోషించి ఉంటాడని అనుమానిస్తున్నారు.
Karimnagar Jewellery Robbery | ప్రత్యేక పోలీసు బృందాలు
ప్రాథమికంగా గ్యాంగ్ సభ్యుల పేర్లు, చిరునామాలపై పోలీసులు స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్, కరీంనగర్కు చెందిన ప్రత్యేక పోలీసు బృందాలు బీహార్లో మకాం వేసి గాలింపు చేపట్టాయి. నిందితుల బంధువులు, సన్నిహితుల ఫోన్ నంబర్లపై నిఘా పెట్టి వారి లొకేషన్ను ట్రాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా ధర్మపురిలోని విజయలక్ష్మీ లాడ్జిలో ఝార్ఖండ్కు చెందిన సౌరభ్ మిశ్రా పేరిట గదులు అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే మార్చి నెలలో పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో కూడా ఈ గ్యాంగ్ సభ్యులు బస చేసినట్లు సమాచారం. హార్వెస్టర్ మెకానిక్లమని చెప్పి లాడ్జి యాజమాన్యాన్ని నమ్మించిన ఈ ముఠా, పరిస్థితులను గమనించిన తర్వాత మిగతా సభ్యులను అక్కడికి రప్పించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్ 27 నుంచి 30 వరకు పెద్దపల్లిలో ఉండి, అనంతరం ధర్మపురికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది.
Karimnagar Jewellery Robbery | ఈ గ్యాంగ్ ప్రత్యేక వ్యూహం అమలు
దోపిడీ అనంతరం పోలీసులు గుర్తించకుండా ఉండేందుకు ఈ గ్యాంగ్ ప్రత్యేక వ్యూహం అమలు చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర (Maharashtra)లో తయారయ్యే ప్రత్యేక బ్యాగులను ఉపయోగించడం ద్వారా దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ బీహారీ ముఠా గతంలో కూడా పలు రాష్ట్రాల్లో బంగారు ఆభరణాల దోపిడీల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. చోరీ చేసిన నగలను పంచుకుని వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోవడం వీరి పని విధానమని తెలుస్తోంది. అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్న పోలీసులు త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.
ఇది కూడా చదవండి..: Karimnagar substation fire | దుర్షేడ్ సబ్ స్టేషన్లో కార్చిచ్చు.. ఎగసిపడుతున్న మంటలు

