Kavitha DGP Remarks | డీజీపీ రికమండేషన్‌తో ఉద్యోగంలో చేరారా.. కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్​పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha DGP Remarks | తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్​ (CV Anand)పై తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పరీక్ష రాసి ఉద్యోగంలోకి వచ్చారా.. లేక రికమండేషన్​తో వచ్చారా అని ప్రశ్నించారు.

కవితపై ఇటీవల ఓ కానిస్టేబుల్ సోషల్​ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు రావడంతో పోలీసులు ఆయనను సస్పెండ్ చేశారు. ఈ అంశంపై తాజాగా కవిత మీడియాతో మాట్లాడారు. తనపై కానిస్టేబుల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను దూషిస్తే మూడేళ్ల వరకు శిక్ష పడుతుందని, కానీ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌తో సరిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రోజు తనపై కామెంట్ చేశారని, రేపు ఇతరుల గురించి పోస్టు చేస్తారన్నారు.

Kavitha DGP Remarks | క్రైమ్​రేట్​ పెరిగింది

సీవీ ఆనంద్​ డీజీపీ అయ్యాక రాష్ట్రంలో క్రైమ్‌రేట్‌ పెరిగిపోయిందని కవిత అన్నారు. కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వాన్ని బద్నాం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో హేట్‌స్పీచ్‌పై చట్టం చేయాలని డిమాండ్ చేశారు.తన గురించి ఆ వ్యాఖ్యలు చేసిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవడంలో, కేసు నమోదు చేయడంలో, అభియోగాలు మోపడంలో విఫలమైతే, మీ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ వేదికపై ఎండగడతానని కవిత హెచ్చరించారు.

Kavitha DGP Remarks | కేకే కమిటీ ఏమైంది

డీజీపీకి ఇద్దరు కోడళ్లు ఉన్నారని, ఒకవేళ వారి గురించి ఎవరైనా అంత అసభ్యకరమైన వ్యాఖ్య చేస్తే, కేవలం సస్పెండ్ చేసి ఊరుకుంటారా అని కవిత ప్రశ్నించారు. తన ఆత్మగౌరవం తీవ్రంగా దెబ్బతిందన్నారు. తెలంగాణకు చెందిన ఒక మహిళ పట్ల మీకు కనీస గౌరవం లేకపోతే, డీజీపీగా కొనసాగడానికి అనర్హులన్నారు. ఉద్యమకారులపై వేసిన కేకే కమిటీ ఏమైందని కవిత ప్రశ్నించారు. ఉద్యమకారులకు గుర్తింపుకార్డులు ఇవ్వాలని కోరారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలనేది డైవర్షన్‌ పాలిటిక్స్​లో భాగం అన్నారు.

దీనిని కూడా చదవండి : Rajasthan Heavy Rains | రాజస్థాన్​లో దంచికొడుతున్న వానలు.. భారీగా ఆస్తి నష్టం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.