అక్షరటుడే, వెబ్డెస్క్: Maharashtra TET Paper Leak | మహారాష్ట్ర TET (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడైన బిజేంద్ర కుమార్ గుప్తాను భివండీ పోలీసులు బీహార్లో అరెస్టు చేశారు. అతన్ని పూణే విమానాశ్రయానికి తీసుకువచ్చారు.
మహారాష్ట్ర (Maharashtra) టెట్ పేపర్ లీక్ వెనుక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజేంద్ర గుప్తాను, కొన్ని రోజులుగా పరారీలో ఉన్న తర్వాత బీహార్లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు పరీక్షా పత్రాల లీక్ కేసులతో అతడికి సంబంధం ఉంది. బీహార్లోని పలు ప్రాంతాల్లో మహారాష్ట్ర పోలీసులు నిరంతరంగా దాడులు చేస్తున్నా.. కొంతకాలంగా నిందితుడు తప్పించుకుంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా అతడితో పాటు మరో నిందితుడిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Maharashtra TET Paper Leak | కీలక పాత్ర
టెట్ పేపర్ లీక్ కేసులో గుప్తా భార్యతో సహా పలువురు నిందితులను మహారాష్ట్ర పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు. అయినా అతడు పరారీలో ఉండటంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. కాగా బిజేంద్ర కుమార్ గుప్తా భారతదేశవ్యాప్తంగా పలు పరీక్షా పత్రాల లీక్ కేసులలో కీలక పాత్ర పోషించాడని సమాచారం. టెట్ పేపర్ లీక్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు గుప్తా భార్య సమక్షంలో జరిగాయని పోలీసులు గుర్తించారు.
Maharashtra TET Paper Leak | ఆస్తుల కొనుగోలు
పేపర్ లీక్ నెట్వర్క్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఢిల్లీ, పాట్నాలో నిందితులు ఆస్తులు కొనుగోలు చేశారు. కాగా జూన్ 28న టెట్ పరీక్ష జరగాల్సి ఉండగా.. థానేలోని కొంగావ్ ప్రాంతంలో లీకైన టెట్ ప్రశ్నపత్రాలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలపై ఆకాష్ కుమార్, రాజీవ్ కుమార్, ధీరజ్ సింగ్ అనే ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అధికారులు ఈ పరీక్షను వాయిదా వేశారు. ఈ కేసు విచారణలో పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. మొత్తం నెట్వర్క్ను ఛేదించారు. తాజాగా ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి..: Modi Instagram Record | ఒకే రీల్.. 30 కోట్ల వ్యూస్.. ఫిఫా రికార్డును బ్రేక్ చేసిన ప్రధాని మోదీ