MDR Charges | యూపీఐ ఉచిత శకం అంతం.. రూ. 10 వేల లావాదేవీలపై రూ.40 వసూలు.. డిజిటల్ భారం మోయాల్సిందేనా?..

కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MDR Charges | కరోనా సంక్షోభ సమయంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించి, ప్రజలకు అలవాటు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా అదే యూపీఐ (UPI) చెల్లింపులపై ఎండీఆర్ (MDR) ఛార్జీలను విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అక్టోబరు 15 నుంచి రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన ‘పర్సన్-టు-మెర్చంట్’ (P2M) లావాదేవీలపై 0.4% రుసుము అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అంటే ఎవరైనా వ్యాపారికి రూ.10 వేలు పంపిస్తే.. దానిపై రూ. 40 ఛార్జీ రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నమాట. కాగా, వ్యక్తులు ఒకరి నుంచి ఒకరికి ఎంత డబ్బు పంపినా.. ఛార్జీలు ఉండవు. కానీ, వ్యాపారులకు పంపితే మాత్రం ఎండీఆర్​ వర్తిస్తుంది.

MDR Charges | వారికి మినహాయింపు

పర్సన్​ టు మర్చంట్​ విధానం కింద వర్గీకరించబడిన చిన్న వ్యాపారులు (QR కోడ్‌ల ద్వారా నెలకు రూ. లక్షలోపు స్వీకరించే వారు) MDR చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంటుంది. రూ. 3 వేలకు రూ. 12 ఎండీఆర్​ వర్తిస్తుంది.రూ. 50 వేల లావాదేవీపై రూ. 200 రుసుము పడుతుంది. రూ. 75 వేలు, అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు రుసుము గరిష్టంగా రూ. 300గా పరిమితం చేస్తు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

MDR Charges | సామాన్యుడిపై పడే పరోక్ష భారం

ఈ రుసుములను సాంకేతికంగా వ్యాపారులే చెల్లించాలని నిబంధనలు చెబుతున్నప్పటికీ.. వారు ఈ భారాన్ని వస్తువులు, సేవల ధరలు పెంచి సామాన్య వినియోగదారులపైకే నెట్టే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. హోమ్ అప్లయెన్సెస్, ఖరీదైన వస్తువులు, హాస్పిటల్ బిల్లులు, షాపింగ్ వంటి రూ. 2,000 దాటే ప్రతి చెల్లింపుపై వ్యాపారులు అదనపు రుసుములను వినియోగదారుల నుంచే రాబట్టే అవకాశం ఉంది.

MDR Charges | రూ. 22,000 కోట్ల ఆదాయ వేట?

మొత్తం లావాదేవీల విలువలో సగం వాటాపై 40 బేసిస్ పాయింట్ల (0.4%) MDR విధిస్తే 2028 ఆర్థిక సంవత్సరం నాటికి UPI ద్వారా ఏటా రూ. 22,000 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

అంటే, కరోనా సమయంలో డిజిటల్ ఇండియా నినాదంతో రోడ్డు పక్కన ఉండే చిన్న వ్యాపారి నుంచి పెద్ద మాల్స్ వరకు యూపీఐ విధానాన్ని రుద్దిన ప్రభుత్వం.. తాజాగా దాన్ని రూ. 22,000 కోట్ల భారీ ఆదాయ వనరుగా మార్చుకుంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నెలకు రూ. లక్షలోపు వ్యాపారం చేసే చిన్న QR కోడ్ వ్యాపారులకు, వ్యక్తిగత (P2P) బదిలీలకు మినహాయింపు ఇచ్చినప్పటికీ, సామాన్యుడు చేసే నిత్యావసర రూ. 2,000 దాటే లావాదేవీలు వ్యాపారుల వద్దే జరుగుతాయి.

ఈ నిర్ణయం సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లు పెట్టడమే కాకుండా, నగదు రహిత సమాజం దిశగా సాగుతున్న అడుగులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందనే ఆందోళన పెరుగుతోంది.

దీనిని కూడా చదవండి : Kavitha Employee Comments | కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం.. ఉద్యోగుల నిర్లక్ష్యంపై కవిత సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *