అక్షరటుడే, ఎల్లారెడ్డి: MeeSeva Urea Booking | రైతులకు సబ్సిడీ యూరియాను సులభంగా బుక్ చేసుకునేందుకు ప్రభుత్వం కొత్త మార్గాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మీసేవ కేంద్రాల ద్వారా కూడా యూరియా (Urea)ను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
MeeSeva Urea Booking | యూరియా యాప్తో రైతుల అవస్థల నేపథ్యంలో..
గతంలో రైతులు యూరియా కోసం యాప్ లోనే బుక్ చేసుకోవాల్సి ఉండేది. స్మార్ట్ ఫోన్ లేని, టెక్నాలజీ తెలియని రైతులు ఇబ్బంది పడేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీసేవ కేంద్రాల్లో బుకింగ్ సదుపాయం కల్పించారు. రైతు తమ పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డ్తో మీసేవ కేంద్రానికి వెళ్లాలి. కేంద్రంలోని ఆపరేటర్ రైతు పొలం విస్తీర్ణం, పంట వివరాలు నమోదు చేస్తారు. ఎంత యూరియా అవసరమో సిస్టమ్ లెక్కించి బుకింగ్ చేస్తుంది. బుకింగ్ అయిన తర్వాత రైతు మొబైల్కు ఓటీపీ వస్తుంది. యూరియా వచ్చినప్పుడు ఆ OTP చూపించి గోదాం/డీలర్ వద్ద నుండి తీసుకోవాలి.
MeeSeva Urea Booking | రైతులకు వెసులుబాటు..

యూరియా యాప్ రాని రైతులకు ఈ సౌకర్యం మేలు చేయనుంది. దళారులు మధ్యలో దూరే అవకాశం లేదు. అవసరానికి మించి బుకింగ్ చేసే అవకాశం కూడా ఇందులో ఉండదు. భూమి విస్తీర్ణం ఆధారంగా మాత్రమే యూరియా కేటాయింపు జరుగుతుంది. గడువులోగా రైతులు ఎంపిక చేసిన ఎరువుల డీలర్ వద్ద నుండి యూరియాను తీసుకోవాలి. ఈ కొత్త విధానం ద్వారా రైతులు క్యూ లైన్లలో నిలబడే ఇబ్బంది తప్పుతుంది. సకాలంలో సబ్సిడీ ఎరువులు అందే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Meat Shop Hygiene | మాంసం దుకాణాదారులు పరిశుభ్రత పాటించాలి..