MeeSeva Urea Booking | మీ సేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ ప్రారంభం

మీ సేవ కేంద్రాల ద్వారా యూరియా బుక్​ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MeeSeva Urea Booking | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంపొందిస్తూ, సకాలంలో యూరియా పంపిణీ చేయటం కోసం రాష్ట్ర వ్యవసాయశాఖ యూరియా బుకింగ్ (Urea Booking)సేవను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రస్తుతం ఫర్టిలైజర్​ బుకింగ్​ యాప్ (Fertilizer Booking App)​ ద్వారా యూరియా బుక్​ చేసుకునే అవకాశం ఉంది. అయితే చాలా మంది రైతులు చదువుకోకపోవడం, స్మార్ట్​ఫోన్లు లేకపోవడంతో యూరియా బుకింగ్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంఓల ప్రభుత్వం యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేని రైతులు తమ సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించి, ఆపరేటర్ సహాయంతో యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) నేతృత్వంలో పనిచేస్తున్న మీసేవ, వ్యవసాయశాఖతో కలిసి ఈ కొత్త చొరవను ప్రారంభించింది.

MeeSeva Urea Booking | రూ.10 రుసుముతో..

mee seva

యూరియా బుకింగ్​ కోసం.. రైతు తన పట్టాదారు పాస్‌బుక్ (PPB) నంబర్​తో సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించాలి. మీ సేవ ఆపరేటర్ రైతు వివరాలను సేకరించి, సాగు విస్తీర్ణం, పంట వివరాలను నమోదు చేస్తారు. రైతు ఎంపిక చేసిన ఎరువుల డీలర్ వద్ద అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేస్తారు. రైతు నమోదిత మొబైల్ నంబర్‌కు పంపిన OTPను ధృవీకరించిన తర్వాత వెంటనే బుకింగ్ ఐడి (Booking ID) జారీ అవుతుంది. అనంతరం 48 గంటల్లో రైతులు యూరియా బస్తాలు తెచ్చుకోవాలి. రూ.10 నామమాత్రపు సేవా రుసుముతో మీసేవ ద్వారా రైతులు అందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

MeeSeva Urea Booking | సాధ్యమేనా..

కొన్ని సార్లు ప్రభుత్వం, అధికారులు తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు కావు. మీ సేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ కూడా ఆ కోవలోకో వస్తుందని పలువురు రైతులు అంటున్నారు. ఎంపిక చేసిన డీలర్​ వద్ద యూరియా బుక్​ చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ సమయంలో అక్కడ స్టాక్​ ఉండాలి కదా.. ప్రస్తుతం మండలం యూనిట్​గా ఎరువులు బుక్​ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. లోడ్​ రాగానే సంబంధిత డీలర్​ నిర్ణిత సమయంలో ఆన్​లైన్​లో స్టాక్​ వివరాలు ఎంటర్​ చేస్తున్నారు. క్షణాల్లోనే ఆ స్టాక్​ బుక్​ అయిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకు యూరియా బుకింగ్​ ప్రారంభం అవుతుంది. దీంతో రైతులు పది నిమిషాల ముందుగానే ఫోన్లు పట్టుకొని రెడీగా ఉంటున్నారు.

MeeSeva Urea Booking | పని చేయని యాప్​

ఓకేసారి వేలాది మంది రైతులు బుకింగ్​ ప్రయత్నిస్తుండగా.. అక్కడ వందలాది యూరియా బస్తాలు మాత్రమే ఉంటున్నాయి. ఈ క్రమంలో క్షణాల్లోనే లోడ్​ అయిపోతుంది. మరోవైపు అందరు ఒకేసారి యాప్​ ఓపెన్​ చేయడంతో కొద్దిసేపు స్టక్​ అవుతోంది. దీంతో ముందుగానే ఫోన్​ పట్టుకొని రెడీగా ఉన్నా.. కొందరికి యూరియా బుక్​ కావడం లేదు. ఒక్కొసారి 30 సెకన్లలో స్టాక్​ అయిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మీ సేవ కేంద్రానికి వెళ్లి ఓటీపీ వచ్చే వరకు స్టాక్​ ఉండే పరిస్థితి లేదు. ఒకవేళ ముందుగానే వెళ్లినా.. ఒకరికి బుక్​ చేసేవరకు స్టాక్​ అయిపోతుంది. ఒకవేళ స్టాక్​ ఉంటే.. తెలియని రైతులు ఇతరుల ఫోన్​ నుంచి బుక్​ చేసుకుంటారు. దాని కోసం మీ సేవకు వెళ్లే అవసరం లేదు. అయితే స్టాక్​ వెంటనే అయిపోతున్న తరుణంలో ప్రభుత్వం తెచ్చిన మీ సేవ బుకింగ్​తో ఉపయోగం లేదని అన్నదాతలు అంటున్నారు.

దీనిని కూడా చదవండి : Hormuz Strait Crisis| హర్మూజ్ జలసంధిలో యుద్ధ మేఘాలు.. భారత చమురు ట్యాంకర్‌ను వెనక్కి పంపిన ఇరాన్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *