అక్షరటుడే, కామారెడ్డి: Minor Biker | ఇటీవల పదో తరగతిలో కొడుకు పాసయ్యాడని ఆ తండ్రి సంతోషంలో బైక్ కొనిచ్చాడు. ఈ బైక్తో వేగంగా వెళ్లిన మైనర్ ఒకరి ప్రాణం పోవడానికి కారణమయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.
Minor Biker | రూ.4 లక్షల బైక్ గిఫ్ట్గా..
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. లింగంపేట(Lingampet) మండలంలోని మోతె గ్రామానికి చెందిన పులగం వెంకటస్వామి(39) ఓ కంపెనీలో రికవరీ ఏజెంట్గా పని చేస్తున్నాడు. పనిలో భాగంగా బైక్పై కామారెడ్డి నుంచి అశోక్ నగర్ కాలనీ మీదుగా ఇల్చిపూర్ వెళ్తున్నాడు. కామారెడ్డి(Kamareddy) పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన ఓ బాలుడు ఇల్చిపూర్ వైపు నుంచి కామారెడ్డి వైపు బైక్పై మితిమీరిన వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న వెంకటస్వామి బైక్ను బలంగా ఢీకొన్నాడు.
ఈ ఘటనలో వెంకటస్వామి రోడ్డుపై పడిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. బాలుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
