Modi Targets Congress | ఈ సారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే : ప్రధాని మోదీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Targets Congress | ఈ సారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ప్రధాని మోదీ (PM Modi) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

మోదీ ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్​లోని పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘ నిన్న నేను బెంగాల్‌ (Bengal)లో ఉన్నాను. అక్కడ చరిత్రలోనే తొలిసారిగా బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో కొలువుదీరింది. ఆ ప్రభావం ఇక్కడ కూడా నాకు కనిపిస్తోంది. ఇక్కడ ఎంతో ఉత్సాహం నెలకొని ఉంది, కార్యకర్తలందరూ నూతనోత్సాహంతో నిండిపోయారు. అస్సాంలో తొలిసారి బీజేపీ ‘హ్యాట్రిక్’ విజయాన్ని నమోదు చేసింది. పుదుచ్చేరిలో కూడా బీజేపీ-NDA కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈసారి తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వమే” అని బలంగా చెబుతున్నానని మోదీ పేర్కొన్నారు.

Modi Targets Congress | డబుల్​ ఇంజిన్​ ప్రభుత్వం

బీఆర్ఎస్​, కాంగ్రెస్ రెండు పార్టీల చేతిలోనూ నిరాశకు గురైన తెలంగాణ ప్రజలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్​ ప్రభుత్వం మాత్రమే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలదన్నారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా అంటూ మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. బెంగాల్​లో బీజేపీ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. దీనికి కారణం అక్కడ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని చెప్పారు. బీజేపీ గెలుపుతో బానిస సంకెళ్లు తెగాయన్నారు.

Modi Targets Congress | కాంగ్రెస్​పై విమర్శలు

ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్​ ముఖ్యమంత్రులు ఉన్నారన్నారు. వారు అధికారంలో ఉన్న చోట అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. అనంతరం ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణలో కూడా అదే జరుగుతోందన్నారు. కాంగ్రెస్​ను ముస్లిం లీగ్​, మావో వాది కాంగ్రెస్​గా ఆయన అభివర్ణించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారని మోదీ పేర్కొన్నారు.

Modi Targets Congress | మావోయిస్టు రహితంగా..

మావోయిస్టులతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు మావోయిస్టులకు అండగా ఉన్నాయని ఆరోపించారు. అయితే ప్రస్తుతం వారు తమ అంతిమ శ్వాసను లెక్కబెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో మావోయిస్టులపై చర్యలు తీసుకోడానికి కాంగ్రెస్‌ ముందుకు రాలేదని విమర్శించారు. తెలంగాణ పోలీసులకు ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చి ఉంటే మావోయిస్టులను అణిచివేసేవారన్నారు. ఇప్పుడు రాష్ట్రం మావోయిస్టురహితంగా మారుతోందన్నారు.

Modi Targets Congress | ఇంధన రేట్లు పెంచలేదు

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం వచ్చిందని మోదీ అన్నారు. అయినా ఇంధనం రేట్లు పెంచడం లేదని తెలిపారు. అయితే ప్రజలు పెట్రోల్‌ (Petrol), డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. మెట్రో సేవలను వాడుకోవాలని సూచించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించాలని పిలుపునిచ్చారు. విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని, ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ఆయన కోరారు. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలన్నారు.

 

ఇది కూడా చదవండి : PM Modi Visit | దేశాభివృద్ధిలో హైదరాబాద్​ పాత్ర కీలకం : ప్రధాని మోదీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *