అక్షరటుడే, నిజామాబాద్: Nizamabad Ganja Seizure | సాయి షిర్డీ ఎక్స్ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న 24.3 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో ఆర్పీఎఫ్ పోలీసులు, నిజామాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Nizamabad Ganja Seizure | రెండు సూట్కేసుల్లో గంజాయి
తెల్లవారుజామున 12.35 గంటల సమయంలో సాయి షిర్డీ రైలులో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు తమ సీట్ల కింద రెండు సూట్కేసులతో అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వారిని తనిఖీ చేశారు. సూట్కేసులను తెరిచి చూడగా మొత్తం 24.3 కిలోల ఎండు గంజాయి లభించినట్లు అధికారులు తెలిపారు.
గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారని అధికారులు ప్రశ్నించగా.. తాము ఒడిశా నుంచి షిర్డీకి గంజాయిని తీసుకెళ్తున్నట్లు నిందితులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
Nizamabad Ganja Seizure | రూ.10 వేల కోసం రవాణా
గంజాయి రవాణా కోసం గుర్తుతెలియని వ్యక్తి తమకు రూ.10 వేలు ఇచ్చినట్లు నిందితులు వెల్లడించారని అధికారులు తెలిపారు. షిర్డీలో ఓ నిర్దిష్ట ప్రదేశంలో ఆటో సిద్ధంగా ఉంటుందని, గంజాయిని ఆ ఆటోలో పెట్టాలని తమకు సూచించినట్లు విచారణలో చెప్పినట్లు పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడిన వారిని ఒడిశాకు చెందిన గణేష్ పోలి (20), దీపక్ సాహు (21)గా గుర్తించారు. వారి నుంచి 24.3 కిలోల గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. గంజాయి రవాణా వెనుక ఉన్న వ్యక్తులు, నెట్వర్క్పై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
Konda Sushmitha | తెలంగాణ కాంగ్రెస్లో కొండా కల్లోలం.. సుష్మిత తిరుగుబాటు వెనుక అసలు కథేంటి?
Nizamabad Ganja Seizure | సంయుక్తంగా తనిఖీలు
ఈ తనిఖీల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ మల్లేశ్, ఆర్పీఎఫ్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సిబ్బంది శైలేష్, సలీం, దేవేందర్తో పాటు ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడటంతో రైల్వే మార్గంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘాను మరింత పెంచే అవకాశం ఉంది.