అక్షరటుడే వెబ్డెస్క్: Olympic Archery Center | గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ వేదికలపైకి తీసుకువెళ్లేందుకు యాక్సిస్ బ్యాంక్ ( Axis Bank ), సంజీవ సింగ్ ఆర్చరీ ఇన్స్టిట్యూట్ ట్రస్ట్ (SSAIT) చారిత్రక ముందడుగు వేశాయి. తూర్పు ఉత్తరప్రదేశ్లోని కన్హౌలీలో దేశంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి ఒలింపిక్ ప్రమాణాలతో కూడిన ‘యాక్సిస్ బ్యాంక్ సంజీవ సింగ్ ఒలింపిక్ ఆర్చరీ సెంటర్’ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.
Olympic Archery Center | ప్రత్యేకతలు..
ప్రాంతీయ హబ్: గోరఖ్పూర్ విమానాశ్రయానికి 45 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటవుతున్న ఈ కేంద్రం.. తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల క్రీడాకారులకు ప్రధాన శిక్షణా కేంద్రంగా సేవలందిస్తుంది.
ప్రపంచ స్థాయి మౌలిక వసతులు: మూడేళ్లలో పూర్తి కానున్న ఈ ప్రాజెక్ట్లో ఒలింపిక్ స్థాయి ఇండోర్, అవుట్డోర్ రేంజ్లు, ఆధునిక సిమ్యులేషన్ సదుపాయాలు ఉంటాయి.
అధునాతన టెక్నాలజీ: దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్ సంస్థల ప్రమాణాలతో పాటు 3D షాట్ విశ్లేషణ, శారీరక పర్యవేక్షణ వంటి లేటెస్ట్ స్పోర్ట్స్ సైన్స్ వ్యవస్థలను ఇక్కడ అందుబాటులోకి తెస్తున్నారు.
Olympic Archery Center | భవిష్యత్ ప్రణాళిక..
కేంద్ర ప్రభుత్వ ఖేలో భారత్ నీతి 2025, టాప్స్ (TOPS) లక్ష్యాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రం.. ఏటా 100 మంది రెసిడెంట్ అథ్లెట్లకు, 300 మందికి పైగా దేశీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు వేదిక కానుంది. యాక్సిస్ బ్యాంక్తో పాటు ఎస్బీఐ ఫౌండేషన్, ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ, ఆశా అండ్ సజ్జన్ అగర్వాల్ ఫౌండేషన్ల సహకారంతో శిక్షణ, విద్య, వసతి అన్నీ ఒకే గొడుగు కింద కల్పించనున్నారు.
Olympic Archery Center | నిర్వాహకుల మాటలు..
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉంటే క్రీడా నైపుణ్యం అత్యుత్తమ విజయాలుగా మారుతుందని యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి విజయ్ ముల్బాగల్ తెలిపారు. గతంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను భావి తరాల ఆర్చర్లు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే శిక్షణ, విద్య, వసతి అన్నీ ఒకే చోట లభించేలా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు ఎస్ఎస్ఏఐటి ఫౌండర్, అర్జున అవార్డు గ్రహీత సంజీవ సింగ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Kamareddy Crime Control | నేర నియంత్రణ, గంజాయి నిర్మూలనపై దృష్టి సారించాలి : డీఐజీ సన్ప్రీత్ సింగ్