అక్షరటుడే, భీమ్గల్ : Paddy Procurement Issues | రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) విమర్శించారు. ఆయన భీమ్గల్ (Bheemgal) మండలం బడా భీమ్గల్, బషీరాబాద్లోని ఐకేపీ, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Paddy Procurement Issues | ఎవరి తోలు తీయాలి..?
నెల రోజులుగా ధాన్యం కుప్పల వద్దే కాపలా కాస్తున్న రైతుల గోడును ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఒక్క బడా భీమ్గల్ కేంద్రంలోనే సుమారు 50 లారీలకు పైగా ధాన్యం నిల్వలు పేరుకుపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాలు తీస్తే తోలు తీస్తా అన్న రేవంత్ రెడ్డి (Revanth reddy), ఇప్పుడు క్వింటాలుకు 5 కిలోల వరకు తరుగు తీస్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇప్పుడు ఎవరి తోలు తీయాలో చెప్పాలని ప్రశ్నించారు. దొడ్డు వడ్ల పేరుతో రైతులను వేధించడం దారుణమని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోతుంటే రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను వేధిస్తే సహించేది లేదని, ప్రతి గింజ కొనే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని హెచ్చరించారు.
Paddy Procurement Issues | అధికారులతో ఫోన్లో చర్చ
కేంద్రాల వద్దే ఉన్న ఎమ్మెల్యే వెంటనే కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), పౌరసరఫరాల శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడారు. హమాలీలు, లారీల కొరతను తక్షణమే పరిష్కరించి, యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. రైతుల పక్షాన నిలబడేందుకు తాను అమెరికా పర్యటనను సైతం మధ్యలోనే ముగించుకుని వచ్చానని, సమస్య పరిష్కారమయ్యే వరకు నిరంతరం పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి:Musi Project Works | రూ.7,055 కోట్లతో మూసీ ప్రాజెక్ట్ పనులు

