అక్షరటుడే, భీమ్గల్: Farmers Protest | కాంగ్రెస్ పాలనలో ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు.. వాటిని అమ్ముకోవడానికి అరిగోస పడుతున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దొనకంటి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. భీమ్గల్ (Bheemgal)లోని సుమంగళి చౌరస్తా వద్ద కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జాప్యం కడ్తా, దొడ్డు వడ్లు కొనకపోవడం తదితర సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
Farmers Protest | మండుటెండల్లో పడిగాపులు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చి రోజుల తరబడి మండుటెండలో రైతులు పడిగాపులు కాస్తున్నారని మండిపడ్డారు. తిండి తిప్పలు మాని కల్లాలు, సెంటర్ల వద్ద అన్నదాతలు నిరీక్షిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
Farmers Protest | హామీలు నమ్మి మోసపోయిన అన్నదాత
ఎన్నికల వేళ రైతులకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ (Congress Government).. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలను పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శించారు. నిబంధనల ప్రకారం 16శాతం తేమ ఉండాల్సి ఉండగా.. అది 12 శాతానికి పడిపోయినా కాంటా వేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటను కొనుగోలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఇప్పటికైనా రైతు బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి అన్నదాతల కష్టాలను చూడాలని హితవు పలికారు.
Farmers Protest | పోరాటాలు తప్పవు
నెలరోజులు దాటుతున్నా జిల్లాల్లో పండించిన పంటలో కనీసం నాలుగో వంతు కూడా కొనలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. రైతులు (Farmers) పండించిన ప్రతి గింజ కొనే వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అన్నదాతలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు వారి పక్షాన నిలబడి పోరాడుతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చౌటుపల్లి రవి, మాజీ రైతుబంధు అధ్యక్షుడు శర్మ నాయక్, మాజీ సొసైటీ ఛైర్మన్ శివ నర్సయ్య, కౌన్సిలర్లు గున్నాల భగత్, బొదిరే నర్సయ్య, మల్లెల ప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Prajavani Complaints | ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

