అక్షరటుడే వెబ్డెస్క్: PoK protests | పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో జరుగుతున్న నిరసనలకు భారత్ కారణమంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తన దేశంలోని అంతర్గత వైఫల్యాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చుకునేందుకే పాకిస్థాన్ ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తోందని స్పష్టం చేసింది.
PoK protests | ఏం జరిగిందంటే?
PoKలో ప్రజలు తమ హక్కుల కోసం తీవ్ర నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై స్పందించిన పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఈ ఆందోళనల వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించారు. అంతేకాకుండా, నీటి భద్రత పేరుతో భారత్పై యుద్ధం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
PoK protests | భారత్ కౌంటర్..
ఈ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జయస్వాల్ ( Randhir Jaiswal ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు. దశాబ్దాలుగా పాక్ బలవంతపు ఆక్రమణలో ఉన్న ఆ ప్రాంతాల్లో ఆర్థిక దోపిడీ జరుగుతోందని, అక్కడి ప్రజలు ప్రాథమిక హక్కులను కోల్పోయారని భారత్ గుర్తుచేసింది. ప్రజల ఆందోళనలను అణచివేసేందుకు పాక్ ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని, అమాయకులపై కాల్పులు జరపడమే కాకుండా ఇంటర్నెట్, వైద్య సదుపాయాలను నిలిపివేసిందని విమర్శించింది. సొంత దేశంలో జరుగుతున్న దురాగతాలకు పాకిస్థాన్ను అంతర్జాతీయ సమాజం జవాబుదారీని చేయాలని, ఈ కల్పిత ఆరోపణలను తాము పూర్తిగా తోసిపుచ్చుతున్నామని రణ్ధీర్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: TMC internal conflict | మమతా బెనర్జీపై తిరుగుబాటు.. కీలక నేతల బహిష్కరణ