అక్షరటుడే, వెబ్డెస్క్ : Semiconductor Industry | సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అనుకూలమని మంత్రి శ్రీధర్బాబు (Minister Sridhar Babu) అన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేషియా కంపెనీలను ప్రోత్సహించాలని ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని కోరారు.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి సదుపాయాలతో సెమీ కండక్టర్ ‘ఎకో సిస్టం’ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని శ్రీధర్బాబు తెలిపారు. మలేషియా – పెనాంగ్ (Penang) డిప్యూటీ సీఎం వైబీ జగదీప్ సింగ్ దియో నేతృత్వంలోని ఆ దేశ ప్రతినిధుల బృందం శనివారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ‘తెలంగాణ- మలేషియా(పెనాంగ్)’ మధ్య సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఏఐ, ఇన్నోవేషన్స్, హ్యూమన్ క్యాపిటల్ డెవలెప్ మెంట్ తదితర రంగాల్లో పరస్పర సహకారానికి గల అవకాశాలపై ప్రత్యేకంగా చర్చించారు. చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, అధునాతన సాంకేతిక రంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా ఎదుగుతోందని మంత్రి పేర్కొన్నారు.

Semiconductor Industry | అనేక అవకాశాలు
సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, ఏరో స్పేస్, డిఫెన్స్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ తదితర రంగాల్లో తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు. ‘గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్’గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలిపారు. సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పెనాంగ్కు ఉన్న అనుభవం… గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా తెలంగాణ ఎదిగేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ లాంటి రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని వైబీ జగదీప్ సింగ్ దియో పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి: Hyundai Car Offers | హ్యుందాయ్ కార్లపై భారీ ఆఫర్లు
