అక్షరటుడే, వెబ్డెస్క్: Sharmistha Mukherjee | కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పనితీరుపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, శర్మిష్ఠా ముఖర్జీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయం అనేది సంవత్సరం పొడవునా చేయాల్సిన పూర్తిస్థాయి బాధ్యత అని, అలా కాకుండా అప్పుడప్పుడు వచ్చి అదృశ్యమవ్వడం సరైన పద్ధతి కాదని ఆమె వ్యాఖ్యానించారు.
Sharmistha Mukherjee | ర్యాలీలు చేసి మాయమైతే ఎలా?
ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శర్మిష్ఠా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ క్షేత్రస్థాయిలో కొంతకాలం చురుకుగా ఉండి, ఆ తర్వాత అకస్మాత్తుగా కనిపించకుండా పోతారని తప్పుబట్టారు. “భారత్ జోడో యాత్ర వంటి కార్యక్రమాల వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. రెండు రోజులు ర్యాలీలు నిర్వహించి, ప్రజలను కలిసి వెళ్లిపోతే రాజకీయం నడవదు. ఇది నిరంతరం చేయాల్సిన ప్రక్రియ” అని ఆమె స్పష్టం చేశారు.
Sharmistha Mukherjee | రాహుల్ వైఫల్యం వల్లే ఓటములు..
2014 నుంచి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ప్రధాన ముఖచిత్రంగా ఉన్నారని, అప్పటి నుంచి పార్టీ వరుసగా ఓటములను ఎదుర్కొంటోందని శర్మిష్ఠా గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణ, ఆయన సాధిస్తున్న మెజారిటీని రాహుల్ గాంధీ కాంగ్రెస్ కోసం తీసుకురాలేకపోతున్నారని, ఇది పూర్తిగా రాహుల్ వైఫల్యమేనని ఆమె కుండబద్దలు కొట్టారు.
Sharmistha Mukherjee | పొత్తుల మీదే ఆశలు..

కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడంపై దృష్టి పెట్టకుండా, కేవలం కూటములు, పొత్తుల ద్వారానే గెలవాలని ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. తాను కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే ఈ ధోరణిని గమనించానని, సొంతంగా గెలిచే సత్తాను పెంపొందించుకోవాలనే పట్టుదల ప్రస్తుత నాయకత్వంలో లోపించిందని శర్మిష్ఠా ముఖర్జీ ఆరోపించారు.
ఇది కూడా చదవండి..:Rahul Gandhi Posters | రాహుల్ గాంధీ ‘కనిపించట్లేదు’.. ఢిల్లీలో వెలిసిన పోస్టర్లు