అక్షరటుడే, వెబ్డెస్క్ : Solar Energy Storage | సోలార్ విద్యుత్ను నిల్వ చేస్తూ సింగరేణి రికార్డు సృష్టించడమే కాకుండా భారీగా ఆదాయం సంపాదిస్తోంది. మిగులు సోలార్ విద్యుత్ను బ్యాటరీల్లో నిల్వ చేస్తూ అవసరం అయినప్పుడు వాడుకుంటోంది.
రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో ఉత్పత్తి అయిన కరెంట్ను వినియోగించుకోవాలి. మిగులు విద్యుత్ ఉంటే గ్రిడ్కు ఉచితంగా అందించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మిగులు విద్యుత్ను సద్వినియోగం చేసుకోవడానికి సింగరేణి (Singareni) బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (BESS) ఏర్పాటు చేసింది. దీని ద్వారా సోలార్ విద్యుత్ను బ్యాటరీల్లో నిల్వ చేసి, అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. ఫలితంగా ఉచితంగా పోయే విద్యుత్ ఇప్పుడు సింగరేణికి సిరులు కురిపిస్తోంది.
Solar Energy Storage | రూ.2.5 కోట్లతో..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చాక సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) విద్యుత్ నిల్వ చేయడంపై ఫోకస్ చేశారు. ఈ మేరకు సీఎం ఆదేశాలతో నాలుగు నెలల క్రితం మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సింగరేణి సోలార్ ప్లాంట్కు అనుబంధంగా 1 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.2.5 కోట్లను సింగరేణి యాజమాన్యం ఖర్చు చేసింది.
Solar Energy Storage | బీఈఎస్ఎస్ ఉపయోగం
రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తుకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని సింగరేణితో సహా పలు రాష్ట్ర సంస్థలు సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి 8 చోట్ల 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటిలో 147 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఓపెన్ యాక్సెస్ ప్లాంట్లుగా, మిగిలిన 98.50 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఇన్ హౌజ్ ప్లాంట్లుగా గుర్తించి తెలంగాణ విద్యుత్తు గ్రిడ్డులకు అనుసంధానం చేసింది. ఇన్ హౌజ్ ప్లాంట్ల విద్యుత్తును కూడా తెలంగాణ విద్యుత్ శాఖ గ్రిడ్లకు అనుసంధానం చేసింది. విద్యుత్ ఒప్పందం ప్రకారం ఇక్కడ స్థానిక అవసరాలకు వాడగా మిగిలిన విద్యుత్తుకు తెలంగాణ డిస్కము ఎటువంటి చెల్లింపులు జరపదు. మిగులు విద్యుత్ను ఉచితంగానే గ్రిడ్కు సరఫరా చేయాల్సి ఉంటుంది.
ఉచితంగా అందించే విద్యుత్ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం మందమర్రిలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను ఏర్పాటు చేసింది. జనవరి నుంచి ఇప్పటి వరకు బీఈఎస్ఎస్ యూనిట్ స్థానిక అవసరాలకు వినియోగించగా ఇంకా మిగిలిన 3,35,485 యూనిట్ల విద్యుత్తును నిల్వ చేసింది. దీంతో సింగరేణి సంస్థకు రూ. 25,66,460 ఆర్థిక లబ్ధి చేకూరింది.
దీనిని కూడా చదవండి : Telangana Minimum Wages | కార్మికులకు సీఎం గుడ్న్యూస్.. కనీస వేతనాలు పెంపు


