అక్షరటుడే, కామారెడ్డి: Theft Case Arrest | ఓ మహిళ చోరీకి పాల్పడింది. కానీ, ఆ ప్రదేశంలో తాను లేనట్టుగా చూపించేందుకు ‘దృశ్యం’ సినిమాను తలపించేలా ఫేక్ టికెట్స్, ఫేక్ బిల్లులు సృష్టించింది. అయినా పోలీసులకు దొరికిపోయింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు కామారెడ్డి (Kamareddy) డీఎస్పీ మధుసూదన్ వెల్లడించారు.
Theft Case Arrest | భిక్కనూరు మండలం జంగంపల్లి..
భిక్కనూరు (Bhikkanoor) మండలం జంగంపల్లికి చెందిన దొడ్ల స్వామి గురువారం వ్యవసాయ పనులకు వెళ్లగా.. ఆయన భార్య ఇంట్లోని బీరువాలో 6 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి ఆభరణాలు, కొంత నగదు ఉంచి తాళం వేసి వెళ్లింది.
సాయంత్రం వచ్చి చూడగా బీరువా తెరిచి ఉండి సొత్తు కనిపించలేదు. ఈ విషయమై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో సీఐ నరేష్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ విశ్లేషణ ఆధారంగా అదే గ్రామానికి చెందిన దొడ్లె లత ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
Theft Case Arrest | పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు.
పోలీసులకు దొరకకుండా ఉండేందుకు నిందితురాలు ‘దృశ్యం’ సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేసింది. ఘటన జరిగిన రోజు తాను కామారెడ్డిలో షాపింగ్ చేసినట్లు బస్సు టికెట్లు, షాపింగ్ బిల్లులు సిద్ధం చేసి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది.
అయితే సాంకేతిక ఆధారాలు, క్షుణ్ణమైన విచారణతో ఆమె చెప్పిన మాటల్లోని అబద్ధాన్ని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి 3.34 తులాల బంగారు గుండ్లు, 0.50 తులాల బంగారు చెవి కమ్మలు, 0.29 తులాల బంగారు మాటీలు, 0.10 తులాల చిన్న బంగారు మాటీలు, 0.039 తులాలు, 0.14 తులాల బంగారు ముక్కుపుడకలు, 25.60 తులాలు, 17.90 తులాలు, 6.70 తులాల మూడు జతల వెండి పట్ట గొలుసులు, 56.39 తులాల వెండి కాళ్ల కడియాలు, 35.90 తులాల సలాన్ వెండి కాళ్ల కడియాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. మీడియా సమావేశంలో సీఐ నరేష్, ఎస్సై అనిల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: CBSE 10th Results | CBSE 10వ తరగతి రెండో బోర్డు పరీక్షల ఫలితాలు విడుదల.. DigiLockerలో రిజల్ట్స్