అక్షరటుడే, వెబ్డెస్క్ : YS Jagan | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర వాగ్వాదం చెలరేగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, ప్రశ్నించే గొంతుకలను ఉద్దేశపూర్వకంగా అణచివేస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం జరుగుతోందని జగన్ మండిపడ్డారు. “ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే అది దేశద్రోహమా? ఇది ప్రజాస్వామ్య పాలనా విధానమా, లేక జంగిల్ రాజ్నా?” అని ఆయన ప్రశ్నించారు.
YS Jagan | జగన్ ఆవేదన…
సీనియర్ జర్నలిస్టులు పూడి శ్రీహరి (Pudi Srihari), కేవీఆర్లపై (KVR) ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని జగన్ పేర్కొన్నారు. బీసీ వర్గానికి చెందిన పూడి శ్రీహరిపై అక్రమ కేసులు నమోదు చేసి, ఇంట్లో సోదాలు నిర్వహించడం అన్యాయమని అన్నారు. “అతను ఉగ్రవాదినా? టెర్రరిస్టా?” అని ప్రశ్నించారు. అలాగే తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ కేవీఆర్ ఇంట్లో ఆయన లేని సమయంలో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం ‘రెడ్బుక్ పాలన’కు నిదర్శనమని ఆరోపించారు. గత రెండేళ్లలో మహిళలు, బాలికలపై జరిగిన దాడుల కేసుల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని జగన్ విమర్శించారు. “మీ పార్టీకి చెందిన వారు అత్యాచారాలు, హత్యలు చేసినా చర్యలు లేవు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వెంటనే కేసులు పెడుతున్నారు. వాస్తవాలు చెప్పడమే నేరమా?” అని ఆయన ప్రశ్నించారు.
YS Jagan | ప్రభుత్వం విఫలం
ప్రజల భద్రతను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని, రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని విమర్శిస్తూ, ఈ చర్యలకు తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. మీరు చేస్తున్న దుర్మార్గాలకు దేవుడు, ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది,” అని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కక్ష సాధింపు చర్యలు, అక్రమ అరెస్టులు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి : Realme Narzo 100 Lite | బిగ్ బ్యాటరీతో రియల్మీ ఫోన్

